అసెంబ్లీ సాక్షిగా బాబు, కాంగ్రెస్‌ కుమ్మక్కు

హైదరాబాద్:

ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ కుమ్మక్కైన విషయం నిండు అసెంబ్లీ మరో సారి సాక్షిగా నిలిచిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగేలా చంద్రబాబు పూర్తిగా సహకరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను గురువారం అసెంబ్లీ సమీపంలో అరెస్టుచేసి తీసుకెళ్లిన తర్వాత గోషామహల్ స్టేడియంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.

‌సమైక్య తీర్మానం చేయాలని లేదా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఓటింగ్ జరపాలని తాము డిమాండ్ చేస్తే, ‌అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని శోభా నాగిరెడ్డి చెప్పారు. తమను సస్పెండ్ చేసే సమయంలో కూడా వీరిద్దరి మధ్య జరిగిన కుమ్మక్కు స్పష్టంగా బయటపడిందన్నారు.

‌అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ తమ పార్టీ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు తీర్మానం ప్రతిపాదిస్తూ ఉండగానే ప్రతిపక్షనేత చంద్రబాబు సీఎంకు చేత్తో సైగ చేస్తూ ఒక్కరోజే సస్పెండ్ చేయాలన్నట్లు సంకేతం ఇచ్చారని‌ ఆమె తెలిపారు. ఆ సంకేతం అందుకున్న సీఎం తమను ఒక్కరోజే సస్పెండ్ చేయాలని శైలజానా‌థ్ ద్వారా మళ్లీ ప్రతిపాదించారని‌ శోభా నాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు సూచనల మేరకే అధికారపక్షం నడుస్తుందనడానికి ఇంతకంటే ఏ సాక్ష్యం కావాలన్నారు.

ముసాయిదా బిల్లుపై చర్చ విషయంలోనూ సీఎం అధిష్టానం ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నారని, తెలంగాణకు చెందిన డిప్యూటీ స్పీకర్‌ను సభాపతి స్థానంలో కూర్చోబెట్టి తెలంగాణపై చర్చ జరిగేలా వ్యవహరిస్తున్నారని శోభా నాగిరెడ్డి విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top