తాడేపల్లి: అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణంగా వంచిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు హామీలిస్తూ చంద్రబాబు చెప్పిన మాటల వీడియో క్లిప్ను జత చేస్తూ.. చంద్రబాబు చేసిన మోసాలను తూర్పారబడుతూ ‘రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం – మోసం నిజం..’ అంటూ ఆదివారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. పీఎం కిసాన్తో కాకుండా మూడేళ్లలో టీడీపీ కూటమి సర్కార్ ఒక్కో రైతు కుటుంబానికి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.19 వేలేనని స్పష్టం చేశారు. టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం.. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కకున్నా చీమ కుట్టినట్టైనా లేదా? అంటూ నిలదీశారు. మీరు రైతులకు ఇచ్చింది.. వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమేనంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘ఎక్స్’లో వైఎస్ జగన్ ఏమని పోస్టు చేశారంటే.. ⇒ చంద్రబాబు గారు.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్ధలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా.. మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలైనా అన్నీ మోసాలే. మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా ఒక్క సంవత్సరం కూడా మాట తప్పలేదు. పైగా మేం మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం. ఎన్నికల ముందు రాజమహేంద్రవరం వేదికగా పీఎం–కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 చొప్పున ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ పోస్టుకు మీరు మాట్లాడిన మాటలు జత చేస్తున్నా. ⇒ 2024–25లో పీఎం–కిసాన్కు అదనంగా మీరు ఇస్తానన్నది, ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది – సున్నా. 2025–26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే. 2026–27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది – కేవలం రూ.5,000. అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం–కిసాన్ కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.19,000. పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85 లక్షల మందికి కుదించారు. కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు. ⇒ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో మేం ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాం. ఈ రెండేళ్లలో మీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు. ⇒ ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్టనష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియం కూడా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం. అది కూడా రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని మీరు ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ–క్రాప్ను, టెస్టింగ్ ల్యాబ్లను నాశనం చేశారు. ⇒ ఆక్వా రైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్గా ఉన్న ‘అప్సడా’ అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వా ఫీడ్కు రూ.4 పెంచారు. జూన్లో మరో రూ.10– రూ.12 పెంచారు. కిలోకు ఏకంగా రూ.14– రూ.16 చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యల మేత ధర రూ.72 వేల నుంచి రూ.1.08 లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిన పరిస్థితి. ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టీమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరా చూస్తే తగ్గించింది కేవలం రూ.2 మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప! ఆక్వా రైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీని పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12 చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి ఇవ్వాళ్టికీ రూ.380 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4 ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది? పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం.. సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా? ౖఇక మీరు రైతుల కోసం ఏం చేసినట్టు చంద్రబాబు గారూ? మీరు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే! ఎన్నికల ముందు ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు చెబుతున్న వీడియో కోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి...