<br/><strong>- వైయస్ జగన్ను కలిసిన మున్సిపల్ కార్మికులు</strong>విశాఖ: అసంఘటిత రంగ కార్మికులకు అండగా ఉంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం మున్సిపాలిటి కార్మికులు వైయస్ జగన్ను కలిశారు. మునిసిపల్ కార్మికుల ఉపాధి హక్కులకు ఎసరు తెచ్చే జీవో నెం.279ని వెంటనే రద్దు చేసేలా పోరాటం చేయాలని వారు కోరారు. రాష్ట్రంలో 40 వేల మంది కార్మికులు ఒప్పంద, పొరుగు సేవల కింద పనిచేస్తున్నారని వారందరి ఉపాధి హక్కులకు ఈ జీవో ద్వారా సమస్యలు వస్తాయన్నారు. కార్మికులకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించే విధానానికి స్వస్తి చెప్పి 'వర్కు' ఔట్సోర్సింగ్కు ఇవ్వడమంటే బడా పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరచటమేనని ఆయన అన్నారు. ఈ విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు అసంఘటిత రంగ కార్మికులకు భద్రత కల్పిస్తామని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వారందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, అలాగే బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల హామీని ఇచ్చి ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కడమే కాకుండా అసంఘటిత కార్మికులకు నష్టం కల్గించేలా వ్యవహరించడం సరికాదన్నారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.