<strong>అసెంబ్లీ ప్రతిష్ట దిగజార్చొద్దు</strong><strong>కాంట్రాక్ట్ ఉద్యోగుల పొట్టగొట్టొద్దు</strong><strong>సెక్స్ రాకెట్ నిందితులను కఠినంగా శిక్షించాలి</strong><strong>ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాలి</strong><br/>హైదరాబాద్ః టీడీపీ సర్కార్ అసెంబ్లీకి ఉన్న గౌరవాన్ని ప్రతిష్టను దిగజారుస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను ప్రైవేటు యూనివర్సిటీలో నిర్వహిస్తాం, హయ్ లాండ్ లో నిర్వహిస్తాం, థాయ్ లాండ్ లో నిర్వహిస్తామంటూ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు నచ్చిన వ్యక్తులకు కోట్లాది రూపాయలు కట్టబెట్టేందుకే చంద్రబాబు ఆవిధమైన ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రమంతా తన జాగీరన్నట్టు సొంత ఎస్టేట్లా భావిస్తూ చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. <br/>పదేళ్లు హైదరాబాద్ నుంచి కదిలేది లేదని చెప్పిన చంద్రబాబు...ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కేసీఆర్ తో ఒప్పందం కుదుర్చుకొని విజయవాడకు మకాం మార్చారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. విజయవాడలో అనుమతి లేని ఇంట్లో ఉంటూ రోడ్లు, రిపేర్లు అంటూ వందల కోట్లు దుబారా చేశారని, హైదరాబాద్ లో క్యాంపు ఆఫీసు కోసం 40,50 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. ఈరకంగా ప్రజాధనాన్ని దుబారా చేసే వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉండరని ఫైరయ్యారు. అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా చంద్రబాబు ఏ ఒక్కటి నిర్వహించలేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. 30 అడుగుల దూరం వెళ్లినా ప్రత్యేక విమానాల్లో ఎగురుతూ చంద్రబాబు రాచరిక పాలన సాగిస్తున్నారన్నారు. <br/>పోలవరం కట్టమంటే టెంపరరీ అంటూ పట్టిసీమ కట్టి దోపిడీకి పాల్పడ్డారని శ్రీకాంత్ రెడ్డి పచ్చసర్కార్ పై నిప్పులు చెరిగారు. టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ సచివాలయం అంటున్నారని...అసలు ఈప్రభుత్వమే టెంపరరీ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పుష్కరాల్లో రూ. 1650 కోట్లు దోచుకున్నారు. కృష్ణా పుష్కరాల్లో మరో రూ.2000 కోట్లు దోపిడీకి తెరలేపుతున్నారని చెప్పారు. ప్రజలు బాధపడుతున్నారని, వారి సొమ్మును దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని నిలదీశారు. <br/>ఎన్నికల ముందు లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడం తో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానన్న చంద్రబాబు..ఉన్న ఉద్యోగులను తీసేస్తున్నాడని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. పేద ప్రజలకు వరంగా ఉండాలని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య మిత్రలను నియమిస్తే..చంద్రబాబు జీవో నం. 28 తీసుకొచ్చి 5 వేల మంది ఉద్యోగులను రోడ్డున పడేయడం దారుణమన్నారు. ఏదో ఓ సాకు చూపి వారిని తొలగించి ...జన్మభూమి కమిటీ మాదిరి ఆరోగ్యమిత్రలో తెలుగుతమ్ముళ్లను నింపేందుకు కుట్రపన్నుతున్నాడని ఆరోపించారు. అసెంబ్లీలో దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. <br/><br/>కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై తాము అసెంబ్లీలో చర్చకు పట్టుబడితే...సమావేశాలను తప్పుదోవ పట్టించి చంద్రబాబు ఆనిందను తమ మీద వేయాలని చూశారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిని వదలవద్దని అసెంబ్లీలో తాము నిలదిస్తే...అకారణంగా మహిళా శాసనసభ్యురాలిని సస్పెండ్ చేశారని వాపోయారు. అసలు దోషులను వదిలేసి కొందరు నిందితులపై తూతూమంత్రంగా కేసులు వేయించిన చంద్రబాబు...వారిని బెయిల్ పై బయటకు తీసుకొచ్చి మళ్లీ ఆపని చేయించేలా చూస్తున్నాడని ధ్వజమెత్తారు.