మంత్రులకే తెలియని కార్యక్రమాలెందుకు?

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెడుతున్న జన్మభూమి కార్యక్రమం ఆయన కేబినెట్లోని మంత్రులకే అర్థం కావడంలేదని, అవి ప్రజలకేమి అర్థమవుతాయని, వాటి వల్ల కలిగే ప్రయోజనమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది.

శనివారం డ్వాక్రా మహిళలతో బాబు ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలపై మంత్రులు స్పష్టత కోరడం, వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తే వాటిపై ప్రభుత్వంలోని పెద్దలకే స్పష్టత లేదని తెలిసిపోతోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఉప్పులేటి కల్పన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.

‘‘ప్రభుత్వ కార్యక్రమాలపై మంత్రులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకంగా ఒక దళిత మంత్రి పైనే నోరు పారేసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు ప్రవేశపెట్టే పథకాలపై ఆయనకే స్పష్టత లేదని అర్థమవుతుంది’ అని ఎద్దేవా చేశారు.

తెలుగువారి జన్మభూమిని  రెండు ముక్కలుగా చేయడానికి 2008 లోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, రాష్ట్ర విభజనకు కారణమైన ఈ అర్ధ ముఖ్యమంత్రి జన్మభూమి అంటే ఏం చెప్పగలరు? తన జన్మభూమి అయిన చంద్రగిరిలో ఓటమిపాలయిన పార్టీ నేత ఏ  జన్మభూమిలో ప్రజల్ని ఆకట్టుకోగలరు. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్త్తారు. ప్రభుత్వ కార్యక్రమాల గురించి మంత్రులు స్పష్టత కావాలంటే వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్త్తారు.

బడ్గెట్ సమావేశాల్లో ప్రతిపక్ష౦ మీద నానా అవాకులు మాట్లాడించిన చంద్రబాబు... ఇప్పుడు అదే విద్యను మంత్రులపై కూడా ప్రదర్శించారు. ప్రజలైనా, ప్రతిపక్షమైనా, చివరికి ఆయన కేబినేట్ లొని మంత్రులైనా ప్రశ్నిస్తే తట్టుకోలేని మనస్తత్వం చంద్రబాబుది అని దుయ్యబట్టారు.

మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటానికి ఇది అసెంబ్లీ కాదని చంద్రబాబే ఆ సమావేశంలో అన్నారంటే.. ఆయన అసెంబ్లీ వేదికగా తన ఎమ్మేల్యే, మంత్రులను ఉపయోగించుకొని ఎంత బరితెగించి మాట్లాడించారో వేరే చెప్పనక్కరలేదని అన్నారు.

Back to Top