సింగపూర్ పేరుతో మోసం చేయొద్దు

హైదరాబాద్, అక్టోబర్ 19: రాజధాని నిర్మించతలపెట్టిన గ్రామాల రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ నగరాన్ని చూపించి మోసం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. అక్కడి రైతుల మనసుల్లో ఏముందో తెలుసుకోకుండా వారంతా రాజధానికి భూములివ్వడానికి ఆనందోత్సాహాలతో ముందుకు వస్తున్నారని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.

కొన్ని పత్రికలు కూడా ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని ప్రజలపై రుద్దడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని విమర్శించారు. వాస్తవానికి ఆయా గ్రామాల రైతులు తమ భూములు ఏమైపోతాయోనన్న బాధ, నిస్పృహలతో ఉన్నారని, భూములు పోయాక తాము ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేం చెప్పారంటే...

ఎంపిక చేసుకున్న కొందరు అనుకూల రైతులను ఆ ప్రాంతం నుంచి చంద్రబాబు హైదరాబాద్ రప్పించుకుని వారితో తాము అనుకూలమేనని చెప్పించుకోవడం సరికాదు. ఆయన తాబేదారులు, వంధిమాగధులు చంద్రబాబు భజనకే పూనుకున్నారు తప్ప అక్కడి వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రికి తెలియచేయడంలేదు. రైతుల్లో తమకు పూర్తిగా అనుకూలమైనవారే అని నిర్థారించుకున్న తరువాతనే శల్య పరీక్షలు నిర్వహించి మరీ తెచ్చారు. వ్యతిరేకంగా మాట్లాడతారని ఏ మాత్రం అనుమానమున్న వారిని బస్సుల్లో నుంచి మధ్యలోనే దించేశారు.

ఎవరైతే అధికంగా భూములిస్తారో వారిని ఏకంగా పారిశ్రామిక వేత్తలను చేసేస్తానని చంద్రబాబు చెప్పడం, సింగపూర్ పారిశ్రామికవేత్తలతో ప్రత్యక్షంగా అనుసంధానం చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇలాంటి డ్రామాలు చేసే కన్నా రైతుల మనసుల్లో ఏముందో తెలుసుకుని వారి అభీష్టానుసారం వ్యవహరిస్తే మంచిది.  సింగపూర్ నగరాన్ని చూపించి ఇక్కడ భూములు కాజేయాలని చూస్తున్నారు. సింగపూర్ నగరంలో ఏముంది? రైతాంగం ఉందా? ఉండేదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమే కదా! అన్ని ఉత్పత్తులూ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే కదా!

భూములిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందనీ ఇవ్వకపోయినా బలవంతంగా తీసుకునే శక్తి తమకుందని చంద్రబాబు చెప్పడం దారుణం. అసలు 70 శాతం రైతుల సమ్మతి లేనిదే వారి నుంచి భూములు తీసుకోవడం సాధ్యం కాని పని.  తుళ్లూరు ప్రాంతంలో రాజధాని కడుతున్నందుకు అక్కడి రైతులు చంద్రబాబు ఫొటోకు దండవేయాలని కొందరు మంత్రులు, చంద్రబాబు తాబేదారులు చెప్పడం మంచిది కాదు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబుకు చెలగాటంగా ఉంటే రైతులకు మాత్రం ప్రాణసంకటంగా తయారైంది.

రైతులకు న్యాయం జరగాలని కోరుతున్న మా పార్టీపై అపవాదు వేయడం మాని, అసలు రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకుని వ్యవహరిస్తే మంచిది. భూములు ఇవ్వడానికి కొందరు పెద్ద రైతులు సిద్ధంగా ఉండొచ్చు, కాని చిన్న, సన్న రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.

చంద్రబాబు రైతు ద్రోహి అనీ, ఏ వాగ్దానం చేసినా నెరవేర్చరనే అభిప్రాయం ఉంది. రుణ మాఫీకి వాగ్దానానికి మెలికలు పెట్టి ఇప్పటికీ తీర్చకపోవడమే అందుకు ఉదాహరణ. రాజధాని ప్రాంతంలోని రైతుల, కూలీల, కౌలుదారులకు అన్యాయం జరగకుండా వారి హక్కుల పరిరక్షణ కోసం మా పార్టీ కడదాకా పోరాడుతుంది.

Back to Top