చంద్రబాబు నాయుడే ఓ అతి పెద్ద సైకో

కర్నూలు:

చంద్రబాబు నాయుడే ఓ అతి పెద్ద సైకో అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఎనిమిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారని గుర్తుచేశారు. కరెంటు బకాయిల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారని తూర్పారపట్టారు. బకాయిలు చెల్లించలేక వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వైనాన్ని ఆమె ప్రస్తావించారు. అందుకు నిరసనగా రైతులు బషీర్‌బాగ్‌లో ఆందోళన చేస్తే పోలీసుల చేత ఉద్యమకారులను కాల్చి చంపించారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ఆ కాల్పుల్లో మరణించిన రైతు కుటుంబాను కాకుండా రైతులను కాల్చిన పోలీసులను పరామర్శించిన సైకో చంద్రబాబు’ అని శ్రీమతి షర్మిల విరుచుకుపడ్డారు.కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారంనాడు కల్లూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాలలో రోడ్‌షో, వైయస్ఆర్ జనభేరి సభల్లో ప్రజలను‌ ఉద్దేశించి ప్రసంగించారు.

‘మంచివాడని పిలిచి పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. పార్టీలో మంత్రి పదవి ఇచ్చి చేరదీస్తే.. ఏకంగా సీఎం కుర్చీకే ఎసరుపెట్టారు. ఆయనపై చెప్పులు కూడా వేయించారు. ఆ తర్వాత టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌నే పార్టీలో లేకుండా చేసిన పెద్ద సైకో చంద్రబాబు.  పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్‌ చార్జీలు పెంచి వారి నుంచి వసూలు చేసిన రాక్షసుడు. అంగన్‌వాడీ సమస్యలపై ఆందోళనలు చేస్తే వారిని గుర్రాలతో తొక్కించిన కీచకుడు. ఎవరో ఒకరు చనిపోతేనే మరొకరికి పింఛను ఇస్తానని చెప్పిన శాడిస్టు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లిం మైనారిటీలను వెన్నుపోటు పొడిచిన నమ్మకద్రోహి. బాబు మాటల్లో నిజం లేదు.. బాబు వాగ్దానాల్లో నిజం లేదు.. బాబు గుండెల్లో నిజాయితీనే లేదు’ అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

దొంగ హామీలతో ప్రజల్లోకి వస్తున్న బాబును కాలర్ పట్టుకొని నిలదీయాలని‌ శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. ‘వైయస్ఆర్ అనే పదం రాజకీయాలకు కొత్త అర్థం తెచ్చిపెట్టింది. రాష్ట్ర దశ, దిశను మార్చేసింది. వై‌యస్ఆర్ ఆశయాల సాధన‌ కోసమే వైయస్ఆర్‌సీపీ పుట్టింది. ఫ్యాను గుర్తుపై ఓటేసి పార్టీ అభ్యర్థులను గెలిపించండి’ అని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Back to Top