<br/>హైదరాబాద్: నేటి రాజకీయాల్లో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయ పడ్డారు. బాబు రెండేళ్లలో ఏమైనా చేసి ఉంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు కండువాలు కప్పి.. పార్టీలోకి తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అయినప్పటికీ స్పీకర్ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనైతికమని ఆయన అన్నారు. చంద్రబాబు పరిపాలన అవినీతి, అసమర్థతకు మారుపేరుగా మారిందని బొత్స అన్నారు. వీటిని కప్పి పుచ్చుకొనేందుకు డ్రామాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. గెలిచిన ఎమ్మెల్యేలకు కండువాలు కప్పిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. బాబులంటి వారి వల్లే రాజకీయాలంటే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోందన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తే బాధ కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.