బెల్టు షాపులకు ఆద్యుడు చంద్రబాబే!

రామచంద్రపురం, 11 జూన్ 2013: అధికారంలో ఉన్నన్ని రోజులూ ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడేమో ఏదేదో చేస్తానటున్నారని శ్రీమతి వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆమె ఒక సామెతను చెప్పారు. 'దున్నపోతా దున్నపోతా ఎందుకు దున్నలేదంటే... పగలు ఎండ, రాత్రి చీకటి అందట. దున్నపోతు పగలైనా పనిచేయదు, రాత్రైనా పనిచేయదట.  చంద్రబాబు పరిస్థితి అంతేననీ, ఆయన అధికారంలో ఉన్నా పనిచేయరనీ, అధికారం ఇచ్చినా చేయరనీ చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల సోమవారం మండపేట, అనపర్తి, రామచంద్రాపురం నియోజకవర్గాలలో పాదయాత్ర చేశారు. సాయంత్రం రామచంద్రాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. శ్రీమతి షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే..
‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తన రెండో సంతకం.. బెల్టుషాపుల నిషేధం ఫైలుపైనే చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అంటున్నారు. ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ విషయాన్ని చేరుస్తారట. అసలు బెల్టు షాపు అంటేనే చట్టవ్యతిరేకంగా నడుపుతున్న మద్యం దుకాణమని అర్థం. అటువంటి వాటిని తొలగించడానికి చంద్రబాబు మళ్లీ ఇంకో చట్టం తెస్తారట. 

ఇది ఎలా ఉందంటే దొంగతనం చేయడం నేరమని చట్టం చెబుతుంది. అయినా దొంగతనం నిషేధానికి మళ్లీ చట్టం తెస్తానని చెప్తున్నట్టు ఉంది చంద్రబాబు వైఖరి. ఈయనకు తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు ఆయన మన ఖర్మకొద్దీ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. నిజానికి ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తివేసింది ఈ చంద్రబాబు కాదా? బెల్టు షాపు పుట్టింది ఈ చంద్రబాబు హయాంలో కాదా? నారా వారి పాలన సారా వారి పాలనగా సాగిన మాట వాస్తవం కాదా? ఈ చంద్రబాబు గాంధీలా పోజులు పెడుతున్నారు.  మద్యంపై క్లాసులు ఇస్తున్నారని విమర్శించారు. 
అంతా మద్యంలో మునిగి తేలాలనేది ఆయన ఉద్దేశం

‘చంద్రబాబు ఇటీవల ఓ మాటన్నారు. అదేంటంటే.. మన రాష్ట్రంలో మద్యం ధరలు చాలా ఎక్కువైపోయాయట. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. సరసమైన ధరలకే మద్యాన్ని అందిస్తారట. మన రాష్ట్ర ప్రజలంతా మద్యంలో మునిగి తేలాలని ఆయన ఉద్దేశం. మన ఖర్మకొద్దీ ఈయన మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. పైగా ఈయన మహాత్మా గాంధీలా పోజులిచ్చి మద్యంపై క్లాసులిస్తున్నారు. ఈయనకుతోడు అంతే పనికిరాని పాలకపక్షం కూడా ఉంది. మద్యం ఆదాయాన్ని పెంచుకోవడానికి టార్గెట్లు పెట్టి మరీ అమ్మకాలు చేయిస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి నెలా 15 శాతం ఎక్కువ మద్యం అమ్మాలని ఆదేశాలిచ్చింది. నాలుగు సంవత్సరాల్లోనే మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంది ఈ ప్రభుత్వం. ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేసైనా సరే ఖజానాను నింపుకోవాలనుకుంటోంది. మహాత్మా గాంధీని ఆదర్శంగా చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా ఒక మద్యం మాఫియా డాన్‌ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెట్టుకుంది అంటే మన రాష్ట్రంలో మద్యం ఏరులై పారక ఇక ఏమవుతుంది?

నియోజకవర్గానికి ఒకే మద్యంషాపు: మద్యం నేరాలను ఎలా ప్రోత్సహిస్తోందో రెండేళ్ల క్రితమే జగనన్న ఆలోచించారు గనుకనే మద్యం గురించి కొన్ని స్పష్టమైన హామీలిచ్చారు. నియోజకవర్గానికి ఒకే ఒక మద్యంషాపు ఉంటుందని, బెల్టుషాపులను నిషేధిస్తానని హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో వెయ్యి మంది జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ 10 మంది మహిళా పోలీసులను పెట్టి మహిళలకు భరోసాను కల్పిస్తానని కూడా చెప్పారు. ఈ హామీలన్నీ కేవలం ఒక ఏడాది లోపలే తప్పకుండా నెరవేరతాయి. మద్యం నుంచి వచ్చే ఆదాయం కంటే జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యం.

కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనం 

రామచంద్రపురం నియోజకవర్గానికి నేను రావడం ఇది రెండోసారి. తొలిసారి ఉప ఎన్నికల సందర్భంగా అమ్మ విజయమ్మతో కలిసి వచ్చాను. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను ఆశీర్వదించాలని కోరాం. రాజశేఖరరెడ్డి మీద ఉన్న అభిమానంతో, జగన్మోహన్‌ రెడ్డి మీద ఉన్న అభిమానంతో మీరు బోస్‌ను ఆశీర్వదించారు. అందుకనే 2009లో ఆయనకు 53 వేల ఓట్లు వస్తే, ఉప ఎన్నికల్లో 63 వేల ఓట్లు వచ్చాయి. అయినా వైయస్ఆర్ సీపీ విజయం సాధించలేకపోయింది. దానికి కారణం కాంగ్రెస్, టీడీపీలు చేసిన కుమ్మక్కు రాజకీయమే. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి వైయస్ఆర్ సీపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు. అందుకే ఇక్కడ టీడీపీకి కేవలం ఆరు వేల ఓట్లు వస్తే కాంగ్రెస్‌కు 77 వేల ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ ఓట్లు అన్నీ కాంగ్రెస్‌కు పడ్డాయని స్పష్టంగా అర్థమవుతోంది. టీడీపీకి అన్ని తక్కువ ఓట్లు రావడానికి కారణాలు రెండే అయి ఉండాలి. ఒకటి చంద్రబాబుకు విశ్వసనీయత తగ్గిపోయి ఉండాలి. లేదంటే చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయి ఉండాలి. ఈ రెండింటిలో ఏది నిజమో చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి.’
Back to Top