<strong>నెల్లూరు:</strong> నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు మళ్లీ నాటకాలు మొదలు పెట్టారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను ఉక్కుపాదంతో అణిచివేసిన చంద్రబాబు ఇవాళ హోదా అంటూ కూనిరాగం తీస్తూ మరోసారి ప్రజలను వంచించేందుకు తయారవుతున్నాడని ఆరోపించారు. నెల్లూరులో వంచనపై గర్జన వేదికపై భూమన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం వైయస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు వైయస్ జగన్ నేతృత్వంలో అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని దేశానికే చాటిచెప్పిన నాయకుడు వైయస్ జగన్ అన్నారు. గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వనరులను తాకట్టుపెట్టడమే కాకుండా.. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు మూడున్నర లక్షల కోట్లు దోచేశారన్నారు. రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, చంద్రబాబు పాలనను కూకటివేళ్లతో పెకిలించడానికి ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.