<strong>మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా),</strong> 12 డిసెంబర్ 2012: 'ప్రజల సమస్యలు పట్టించుకోని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్తా, ఆయనను చొక్కా పట్టుకుని అడగండ'ని శ్రీమతి షర్మిల అన్నారు. ఇది రాబందుల సర్కార్ అని అభివర్ణించారు. రోజుకు 3-4 గంటలు విద్యుత్ సరఫరా చేస్తూ సర్ఛార్జీల పేరుతో బిల్లులు అమాంతం పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తరఫున చరిత్రాత్మక మరో ప్రజాప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న ఆయన సోదరి శ్రీమతి షర్మిల బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల సిరిగిరిపూర్లో రచ్చబండ నిర్వహించారు.<br/>దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో విద్యుత్, ఆర్టీసీ, వంటగ్యాస్ ధరలు పెంచలేదని శ్రీమతి షర్మిల చెప్పారు. పన్నులు వేయకుండా సంక్షేమ పథకాలను ఆయన అమలు చేశారని గుర్తుచేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తారని హామీ ఇచ్చారు.<br/>అంతకు ముందు రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తులు తమ సమస్యలను శ్రీమతి షర్మిలకు చెప్పుకున్నారు. తాగునీటి సమస్యతో అల్లాడుతున్నమని, సరైన మురుగుకాలువ వ్యవస్థలేక అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూతబడుతున్నాయని వాపోయారు. బస్సు సౌకర్యం లేక పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని అన్నారు. విద్యుత్ బిల్లుల కింద నెలకు 2 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇంటి అద్దెలు కట్టాలో? విద్యుత్ బిల్లులే కట్టాలో? అర్ధం కావడంలేదన్నారు. నగదు బదలీ పథకం పేరుతో రేషన్ దుకాణాల్లో బియ్యం, సరుకులు ఆపేస్తామంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ రాకపోతే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. పావలా వడ్డీ అని చెబుతూ 2 రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారని చెప్పారు. తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు శ్రీమతి షర్మిల ముందు వాపోయారు.