తూర్పు గోదావరి జిల్లా: అనపర్తి నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ నాయకులపై అధికార పార్టీ శ్రేణుల దాడులు కొనసాగుతున్నాయని వైయస్ఆర్సీపీనాయకులు ఆరోపించారు. రామవరం, కుతుకులూరు గ్రామాల్లో వైయస్ఆర్సీపీకి చెందిన ఐదుగురు నాయకుల ఇళ్లపై దాడులు జరగడంతో పాటు, ఇద్దరు నాయకులపై వ్యక్తిగతంగా కూడా దాడులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై స్పందించిన వైయస్ఆర్సీపీ నాయకులు, రాజకీయ కక్షసాధింపుతోనే తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు, బెదిరింపులకు స్థానం లేదని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, వేధింపులు ఆగడం లేదని విమర్శించిన వారు, ఇలాంటి చర్యలతో వైయస్ఆర్సీపీ శ్రేణులను భయపెట్టడం సాధ్యం కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.