నెల్లూరు జిల్లా: కోవూరు టీడీపీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలను, రాజకీయ నాయకులను రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని వైయస్ఆర్సీపీ మహిళా నేతలు మండిపడ్డారు. నియోజకవర్గంలోని అసలు సమస్యలు, అభివృద్ధి అంశాలపై దృష్టి సారించాల్సిందిపోయి అనవసర విమర్శలతో రాజకీయ వేడి పెంచడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. డబ్బు ఉంటే ప్రజల బాగు కోసం ఖర్చు చేయాలని, కానీ వైయస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించకూడదని విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి రాజకీయ ఆరోపణలు చేయడం ద్వారా ఎమ్మెల్యే బాధ్యతను విస్మరిస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని, పూజితను విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదని మహిళా నేతలు పేర్కొన్నారు. కాకాణి గారు ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అలాంటి నాయకుడిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. గ్రామాల్లో నూతన పింఛన్లు మంజూరు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చిన పథకాలు అమలు కాక ఆవేదన వ్యక్తమవుతోందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు సకాలంలో అందేవని, ప్రజలు సంతోషంగా జీవించేవారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని వైయస్ఆర్సీపీ మహిళా నేతలు కోరారు.