విజయవాడ: శాతవాహన కళాశాల యాజమాన్యం ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కళాశాల భవనాల్ని కూల్చివేసిన ఘటనలో బోయపాటి శ్రీకృష్ణ పై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర డిమాండ్ చేశారు. ముందస్తు భవనాల కూల్చివేతలపై వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం చుట్టుగుంటలోని శాతవాహన కళాశాలలో ధర్నా నిర్వహించారు. కూల్చేసిన శిధిల భవనాల్ని పరీశీలించారు. ఈ సందర్భంగా యాజమాన్యంకి ఒత్తాసు పలికిన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాసరావు ని అడ్డుకున్నారు. విద్యార్థి నేతలకు, ప్రిన్సిపాల్ కి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర మాట్లాడుతూ.. సుమారు ఐదు దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన శాతవాహన కళాశాల భవనాల్ని అక్రమంగా కూల్చివేసి విద్యార్థులకి తీవ్ర అన్యాయం చేసారని మండిపడ్డారు. శాతవాహన కళాశాల హక్కుదారుడిగా బోయపాటి శ్రీనివాస అప్పారావుకి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. భవనాలు కూల్చివేయాలని తీర్పులో లేదన్నారు. పోలీసులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా భవనాలు కూల్చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఈ సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కిడ్నాప్ చేసి సంతకం చేపించుకున్నప్పుడు కళాశాల విద్యార్థులు, స్టాప్ చాలా నష్ట పోతారని గగ్గోలు పెట్టిన ప్రిన్స్ పాల్ వంకాయలపాటి శ్రీనివాసరావు భవనాల కూల్చివేతపై మౌనం వహించడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. శిధిలాల కింద విద్యార్థుల సర్టిఫికెట్లు, రికార్డులు, పాఠ్య పుస్తకాలు ఉన్నాయన్నారు. విద్యార్థుల జీవితాలతో యాజమాన్యం ఆడుకుంటుందని విమర్శించారు. గత జగన్ మోహన్ రెడ్డి పాలనలో కళాశాల భవనాల్ని కూల్చి వేసిన ఘటన ఒక్కటి కూడా రాష్ట్రంలో జరగలేదని గుర్తు చేసారు. కూటమి పాలన పూర్తయిన ఒక్క సంవత్సరంలోనే కళాశాలల్ని కూల్చి వేసి విద్యార్థుల్ని ఉన్నత చదువులకి దూరం చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే కిడ్నాపులు చేసి బలవంతంగా ఆస్తులు, భూములు లాగేసుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. రెడ్ బుక్ మీద ఉన్న ఆసక్తి ని వదిలేసి పిల్లల పుస్తకాలు, చదువులపై దృష్టి సారించాలని లోకేష్ ని డిమాండ్ చేసారు. శాతవాహన కళాశాలని పరిరక్షించాలని కోరారు. పోలీసులకి కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా కళాశాల భవనాల్ని కూల్చేసిన బోయపాటి శ్రీకృష్ణపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, విద్యార్థుల భవిష్యత్ ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, నాయకులు గోపీచంద్, ఆనంద్, సురేంద్ర, రమేష్,అజాహర్, పూజిత్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.