దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ కట్టుబడి ఉంది

 అపోస్టోలిక్ చర్చి 7వ వార్షికోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

కర్నూలు : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతుందని శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. కర్నూలు పట్టణంలోని గణేష్ నగర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు ఆహ్వానం మేరకు నిర్వహించిన అపోస్టోలిక్ చర్చి 7వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభన్‌బాబు కుటుంబ సభ్యులు, చర్చి సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన చర్చి సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్‌కు వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన ఘనత వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. దళిత క్రైస్తవుల రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా శోభన్‌బాబును నియమించడం వెనుక ఆయన పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల అభ్యున్నతికి చేస్తున్న సేవలే కారణమని శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు, మత గురువులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 


 

Back to Top