విశాఖపట్నం: జబ్బర్ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుని, ఈ విషాద సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలు ప్రమాదం అనంతరం ఎదుర్కొంటున్న కష్టాలను, తమ ఆవేదనను వైయస్ జగన్కు వివరించాయి. వారి బాధలను ఓర్పుగా విన్న ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చుతూ ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బోటు ప్రమాదం నుంచి ప్రాణాపాయ స్థితి నుంచి సురక్షితంగా బయటపడిన కారి చిన్నాను కూడా పరామర్శించారు. ప్రమాదం జరిగిన పరిస్థితులు, రక్షణ చర్యల వివరాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని, మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.