తాడేపల్లి: విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాల్సిన ప్రభుత్వం మద్యం విక్రయాలను ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. విశాఖ వంటి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లో బీచ్ షాక్స్ పేరుతో మద్యం అమ్మకాలు చేపట్టడం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. బీచ్ షాక్స్ నిర్ణయం రాష్ట్రాన్ని ‘మద్యాంధ్రప్రదేశ్’గా మార్చే ప్రయత్నంలో భాగమేనని ఆరోపిస్తూ, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రెస్మీట్లో కొండా రాజీవ్ గాంధీ ఏమన్నారంటే.. - మద్యాంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే కూటమి లక్ష్యమా? కూటమి ప్రభుత్వం పనితీరు పిచ్చోడు చేతిలో రాయి పెట్టినట్లుగా ఉంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు పెరిగాయి. ఇప్పుడు విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ పేరుతో బహిరంగంగా మద్యం విక్రయాలకు అనుమతులు ఇస్తున్నారు. బీచ్ షాక్స్ అంటే బీచ్ వెంట గుడిసెలు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలే ప్రధాన ఉద్దేశం. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందని స్పష్టమవుతోంది. - వైఎస్ జగన్ బ్రాండ్ విద్య, వైద్యం.. చంద్రబాబు బ్రాండ్ మందు, చిందు వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని చూసైనా ఈ ప్రభుత్వ పెద్దలు పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు విద్య, వైద్యం బ్రాండ్గా నిలిచాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ బ్రాండ్ మందు, చిందుగా మారింది. బీచ్లో బీరు, బారు అనే సంస్కరణను గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎంపీ శ్రీభరత్ విశాఖకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, భూముల పరిరక్షణ వంటి కీలక అంశాలపై నోరు విప్పని ఆయన, ఇప్పుడు బీచ్ షాక్స్ పేరుతో మరో వివాదానికి తెరతీశారు. విశాఖ ప్రజల సమస్యలపై పోరాడాల్సిన ఎంపీ, ఇలాంటి ప్రతిపాదనలను సమర్థించడం దురదృష్టకరం. - విశాఖ బీచ్ను బార్గా మార్చొద్దు విశాఖపట్నం ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా, కుటుంబాలు ప్రశాంతంగా గడిపే నగరంగా పేరుగాంచింది. అలాంటి బీచ్ ప్రాంతాల్లో బీచ్ షాక్స్ పేరుతో మద్యం ఏరులై పారించడం ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు. విశాఖ బీచ్ అంటే తాగి తందానాలు ఆడే ప్రదేశం కాదు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు గంగమ్మ తల్లి ఆలయం, కాళీమాత ఆలయం, శివాలయం, టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఇలాంటి పవిత్ర ప్రాంతాలను బార్లుగా మార్చే ప్రయత్నం హిందూ మనోభావాలను దెబ్బతీస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మద్యం ద్వారా ఆదాయం సంపాదించాలనుకోవడం సిగ్గుచేటు. బీచ్ రోడ్డులో గీతం విద్యాసంస్థలు ఉండగా, విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సింది పోయి మద్యం సంస్కృతిని ప్రోత్సహించడం దురదృష్టకరం. బీచ్ షాక్స్ పేరుతో బార్లు ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. - విశాఖపై ఉద్దేశపూర్వక దాడి విశాఖపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్లో ‘లవ్ ఫెస్టివల్’ పేరుతో వివాదాస్పద కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నించింది. ప్రజల వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన వారు, ఇప్పుడు బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలకు తెరలేపుతున్నారు.వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మాదిరిగా మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఐటీ సంస్థలు తీసుకురావాలనే ఆలోచన చేయకుండా , మద్యం ద్వారా ఆదాయం సంపాదించడానికే కూటమి నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయలేని ప్రభుత్వం మద్యంపై మాత్రం అపారమైన ప్రేమ చూపిస్తోంది. విశాఖ బీచ్ను ఆదాయ వనరుగా కాకుండా ప్రజల ఆస్తిగా చూడాలని, బీచ్ షాక్స్ పేరుతో బార్లు ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కొండా రాజీవ్ గాంధీ డిమాండ్ చేశారు.