సంపదను యథేచ్ఛగా పంచుకు తింటున్నారు

కూటమి ప్రభుత్వంపై మార్గాని భరత్‌ ఫైర్‌

లిక్కర్, ఇసుక ఆదాయం మొత్తం కూటమి నాయకుల జేబుల్లోకే

నిత్యావసరాల ధరలు పెంచి, ఎకానమీ పెరుగుతుందంటారా?

శంకుస్థాపన తప్ప విశాఖ రైల్వేజోన్‌ పనులు మేమే పూర్తి చేశాం

పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలి

ఐదేళ్లు ప్రజలతో పనేం లేదన్నట్టుంది చంద్రబాబు వ్యవహారం 

ప్రెస్‌మీట్‌లో మార్గాని భరత్‌ ఆక్షేపణ

రాజమహేంద్రవరం: అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న కూటమి పార్టీలు మరో ఐదేళ్లు ప్రజలతో పని లేదన్నట్టుగా ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నాయని.. ఇసుక, లిక్కర్‌ మాఫియాతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం జరుగుతున్నా  పట్టించుకోకుండా చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో విజన్‌–2047 అంటూ కోతలు కోస్తున్నారని మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌ ఆక్షేపించారు. ఇసుక, లిక్కర్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని తన పార్టీ నాయకులకు దోచిపెడుతూ 2047 నాటికి రాష్ట్రం 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ స్థాయికి చేరుకుంటుందని సీఎం చంద్రబాబు ఢిల్లీలో చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇండియా ఎకానమీనే 3.1 ట్రిలియన్‌ డాలర్లుందన్న భరత్‌.. చంద్రబాబు విజన్‌ గురించి సాక్షాత్తూ ప్రధాని మాట్లాడారని ఎల్లో మీడియా రాయడం ఎవరి చెవుల్లో పూలు పెట్టడం కోసమని ఎద్దేవా చేశారు. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టి.. యథేచ్ఛగా ప్రభుత్వ సంపద పంచుకు తింటున్నారని మాజీ ఎంపీ దుయ్యబట్టారు.
    విశాఖ రైల్వే జోన్‌కు తమ నాయకుడు వైయస్‌ జగన్‌ చొరవతో గతంలోనే కేంద్రం ఆమోదం తెలిపిందని, శంకుస్థాపన మాత్రమే మిగిలి ఉందని మార్గాని భరత్‌ స్పష్టం చేశారు. పోలవరం నిధులకు ఆమోదం లభించిందని గొప్పగా చెబుతున్నారన్న ఆయన.. అసలు ఎప్పుడు, ఎన్ని నిధులు వస్తాయి? ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలో వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు.

    లిక్కర్‌ మాఫియా, ఇసుక దోపిడి చూస్తే.. నేతి బీరకాయిలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో.. చంద్రబాబుకి నిజాయితీ ఉండదనేది కూడా అంతే నిజమని మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు. వైన్‌షాప్‌ల టెండర్లలో కూటమి ఎమ్మెల్యేల అక్రమ దందా వల్ల, బిడ్లు దాఖలు కాక, నాన్‌ రిఫండబుల్‌ డిపాజిట్ల రూపంలో ప్రభుత్వం దాదాపు రూ.2500 కోట్లు కోల్పోయిందని చెప్పారు. తెలంగాణలో ఒక్కో షాపుకు కనీసం 50 టెండర్లు వస్తే, ఇక్కడ సగటున మూడు మాత్రమే రావడాన్ని ఆయన ఉదహరించారు.
     కూటమి పెద్దలు, ప్రజా ప్రతినిధుల దోపిడి వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని, దీని వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైందని మార్గాని భరత్‌ గుర్తు చేశారు. చివరకు విజయవాడ వరద బాధితుల సాయంలో కూడా గోల్‌మాల్‌ లెక్కలతో రూ. 534 కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. చంద్రయాన్‌ కోసం ఇస్రో చేసిన ఖర్చు రూ. 615 కోట్లయితే, విజయవాడ వరదల పేరుతో చంద్రబాబు చేసిన దోపిడీ రూ.534 కోట్లని మార్గాని భరత్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Back to Top