తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థపై ఘోరమైన మరక పడింది. పదో తరగతి పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో తీవ్ర తప్పిదాలు జరిగాయి. వేలమంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి మరీ మౌనంగా ఉండిపోయారంటూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh)పై వైయస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదో తరగతి పరీక్ష ఫలితాల తర్వాత 60% మంది రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. బోర్డు చేసిన దారుణమైన తప్పులు పాసైన వారిని కూడా ఫెయిల్ చేశాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వమే ప్రమాదంలోకి నెట్టింది. ఇంత దారుణం జరిగినా మంత్రి నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని వైయస్ఆర్సీపీ(YSRCP) ప్రశ్నించింది. నారా లోకేష్ చేసిన తీవ్రమైన ఒత్తిడి వలనే ఉపాధ్యాయులు మార్కులు తారుమారు చేయటానికి కారణమైంది. మొత్తం 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటి వరకు టెన్త్ రీవాల్యూషన్(AP 10th Class Revaluation) 11,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్వయానా ప్రభుత్వమే ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోందట. ఈ పరిణామంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని వైఎస్సార్సీపీ(YSRCP), ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనను జోడించి తన ట్వీట్లో పేర్కొంది. అలాగే ఈ విషయాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో.. అన్ని నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది.