విజయవాడ: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ విద్యార్ధి విభాగం సోమవారం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ధర్నా నిర్వహించింది. విద్యార్థి నేతలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో.. వర్సిటీ ప్రధాన ద్వారం వద్దే బైఠాయించి తమ నిరసన కొనసాగించారు. వైయస్ఆర్సీపీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రా ఆధ్వర్యంలో పార్టీ నేతలు, విద్యార్థులు, యువకులు గుణదల నుంచి హెల్త్ యూనివర్సిటీ దాకా భారీగా ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ సమాచారంతో అప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ వద్దకు చేరుకోగానే వాళ్లను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం, తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో విద్యార్థి నాయకులు యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద భైటాయించి నిరసన తెలుపుతున్నారు.