అమరావతి: బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్న పార్టీనే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పేరుతో సభలో హైడ్రామా నడుపుతోందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం 34 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో విడుదల చేసిందని, ఆ తర్వాత ప్రతాప్రెడ్డి అనే వ్యక్తితో కోర్టులో రిట్ పిటిషన్ వేయించారని ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రమేష్ యాదవ్ మాట్లాడుతూ..పార్టీ పరంగా బీసీలకు 50 శాతం సీట్లు కల్పించిన నాయకుడు శ్రీ వైయస్ జగన్ అని, 18 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే అందులో 11 స్థానాలను బీసీలకు ఇచ్చారని తెలిపారు. మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు, కార్పొరేషన్లలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించడంతో పాటు ఇద్దరు బీసీలను డిప్యూటీ సీఎంలుగా చేసిన ఘనత జగన్దేనని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదని, చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని విమర్శించారు. 136 బీసీ కులాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైయస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనని రమేష్ యాదవ్ తెలిపారు. కోర్టులో నిలబడదని తెలిసే చంద్రబాబు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టారని ఆరోపించారు. బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే మంత్రి మండలిలో బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందంటూ చంద్రబాబు మాట్లాడటం వాస్తవాలను వక్రీకరించడమేనని అన్నారు. రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయని గుర్తించి, ఆయా వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత కల్పించిన నాయకుడు శ్రీ వైయస్ జగన్ అని తెలిపారు. బీసీలను ఎలా గుర్తించాలి, వారికి ఏ విధంగా న్యాయం చేయాలనే దానిపై ఆలోచించి అనేక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్ హయాంలోనే బీసీలకు నిజమైన న్యాయం జరిగిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. బీసీలు రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలంటే శ్రీ వైయస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని కౌరు శ్రీనివాస్ స్పష్టం చేశారు.