వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత

నంద్యాల‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా ఆయన వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం కన్నుమూశారు. గురువారం అవుకులో ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

కాగా, భగీరథరెడ్డి 2003 నుంచి 2009 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2007-08 మధ్య ఆలిండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2019లో తండ్రితో కలిసి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఆయన రెండో కుమారుడైన భగీరథరెడ్డికి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. భ‌గిర‌థ‌రెడ్డి అకాల మ‌ర‌ణం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు దిగ్ర్భాంతికి గుర‌య్యారు. 

Back to Top