గతేడాది వైయస్‌ జగన్ సీఎం కావాలని మొక్కుకున్నా

 ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా
 

విజయవాడ: గత సంవత్సరం నవరాత్రి రోజుల్లో మూలా నక్షత్రం రోజున తాను బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ఓ కోరిక కోరుకున్నానని, అది తీరడంతో ఈ సంవత్సరం తిరిగి అమ్మను దర్శించుకుని, మొక్కు తీర్చుకున్నానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం సరస్వతీ దేవి అలంకారంలో భక్తులను కరుణిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న ఆమె, అనంతరం మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం ఇదే రోజున తాను జగన్ సీఎం కావాలని మొక్కుకున్నానని అన్నారు. తన కోరికను అమ్మ నెరవేర్చిందని చెప్పారు. తన పాలనా విధుల్లో వైయస్‌ జగన్ కు ఎటువంటి ఆటంకాలూ లేకుండా చూడాలని ఈ సంవత్సరం అమ్మను కోరానని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయని, అధికారులు మెరుగైన ఏర్పాట్లు చేశారని అన్నారు. భక్తులు అమ్మను ప్రశాంతంగా దర్శించుకుంటున్నారని రోజా తెలిపారు.

Back to Top