తెలుగుదేశం పార్టీని మూసేయక తప్పదు

పరిషత్‌ ఎన్నికల ఫలితాలతోనైనా చంద్రబాబు కళ్లు తెరవాలి

ఎన్నిక ఏదైనా విజయం వైయస్‌ఆర్‌ సీపీదే

వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి ఆశీస్సులందిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: ఎన్నిక ఏదైనా విజయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదేనని, రాష్ట్ర ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి దీవెనలు, ఆశీస్సులు అందిస్తున్న రాష్ట్ర ప్రజలకు అంబటి రాంబాబు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతోనైనా చంద్రబాబు కళ్లు తెరవాలన్నారు. టీడీపీ మూసేయాలనే సంకేతం ప్రజల నుంచి బలంగా వినిపిస్తుందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించాల్సి ఉండగా.. ఓటమి భయంతో నాటి బాబు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 151 సీట్లు గెలుచుకున్న తరువాత స్థానిక సంస్థల బలోపేతం కోసం అడుగులు పడ్డాయన్నారు. 2020 మార్చిలో ప్రారంభించిన ఎన్నికల ప్రక్రియ ఈరోజు వరకు కొనసాగిందని చెప్పారు. ఎన్నికలకు చంద్రబాబు, కొన్ని దుష్టశక్తులు ఎన్నో అడ్డంకులు సృష్టించాయని, ఎన్నికలు జరిగిన తరువాత కూడా ఫలితాలు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన న్యాయస్థానాలను ఆశ్రయించాయని గుర్తుచేశారు. ఎట్టకేలకు అన్ని అవరోధాలను అధిగమించి ఇవాళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వస్తున్నాయన్నారు. ఎన్నిక ఏదైనా.. ప్రజలంతా ముఖ్యమంత్రి వెంటే అనే సంకేతం బలంగా వినిపిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ సీపీ జెండా రెపరెపలాడుతోందన్నారు. 

ఎన్నికలు బహిష్కరించామని చంద్రబాబు, టీడీపీ నేతలు బుకాయిస్తున్నారని, నామినేషన్, విత్‌ డ్రాలు అయిపోయిన తరువాత ఓటమి భయంతో తప్పుకోవడం బహిష్కరించడమా..? మరి బహిష్కరించని ఎన్నికలు సంగతేంటీ..? పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల మాటేంటీ..? అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబును ప్రశ్నించారు.  

చంద్రబాబు తన పాత నియోజకవర్గం, పుటినిళ్లు.. చంద్రగిరిలో శంకరగిరి మాన్యాలు పట్టిపోయారని, కుప్పం నియోజకవర్గంలో కుప్పకూలిపోయారని ఎమ్మెల్యే అంబటి ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని మూసేయక తప్పదనే సంకేతం ప్రజల నుంచి వినిపిస్తుందన్నారు. కుట్రలు, కుతంత్రాలు తప్ప ప్రజల మధ్యకు వెళ్లి గెలవాలనే తాపత్రయం చంద్రబాబు జీవితంలో లేదని, కుట్రలతో కూడిన చంద్రబాబుకు తిలోదకాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. 

 

Back to Top