చిత్తూరు: కుప్పంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ నేతలు ఆరోపించారు. ఈ నెల 12న నిర్వహించిన "చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్లు" నిరసన ర్యాలీ విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక వైయస్ఆర్సీపీ శ్రేణులపై కేసులు నమోదు చేశారని విమర్శించారు. కుప్పంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, దీంతో రాజకీయ కక్షతో పోలీసులు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ భరత్ను ఏ-1గా చేర్చడంతో పాటు మొత్తం 35 మంది వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. వైయస్ఆర్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేందుకు కేసులు, వేధింపులకు పాల్పడుతున్నప్పటికీ ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.