వైయస్‌ షర్మిల నిర్ణయం.. ఆమె వ్యక్తిగతం

అన్నాచెల్లెలి మధ్య భిన్నాభిప్రాయాలే కానీ, విభేదాలు లేవు 

తెలంగాణలో మరో పార్టీ ప్రారంభించాలన్నది ఆమె స్వంత ఆలోచన

ఏపీకే కట్టుబడి ఉండాలన్నది సీఎం వైయస్‌ జగన్‌ నిశ్చితాభిప్రాయం

రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే సీఎం ఆలోచన

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తరణపై పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చాలా స్పష్టమైన  వైఖరితో ఉన్నారని, తెలంగాణలో పార్టీ విస్తరణ వద్దని సీఎం సూచించారని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. షర్మిలమ్మ తీసుకున్న నిర్ణయం ఆమె సొంత నిర్ణయమన్నారు. తెలంగాణలో మరో పార్టీ పెట్టాలన్నది  వైయస్‌ షర్మిల ఆలోచనగా కనిపిస్తోందన్నారు. అన్నాచెల్లెలి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమేనని సజ్జల చెప్పారు. ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేయాలనే తపన సీఎం వైయస్‌ జగన్‌లో చాలా బలంగా ఉందన్నారు. ఏపీకే కట్టుబడి ఉండాలన్నది సీఎం వైయస్‌ జగన్‌ నిశ్చితాభిప్రాయమని చెప్పారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏం మాట్లాడారంటే.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముద్దుల తనయ, వైయస్‌ జగన్‌ సహోదరి వైయస్‌ షర్మిలమ్మ కోట్లాది మందికి పరిచయం. ప్రస్తుత పరిణామాలపై తప్పుడు భాష్యం వచ్చే అవకాశం ఉంది.

మహానేత వైయస్‌ఆర్‌ మరణం తరువాతి పరిస్థితుల నేపథ్యంలో కోట్లాది మంది అభిమానుల నుంచి వచ్చిన కోరిక, ఆయన మరణం తట్టుకోలేక గుండెలు ఆగిపోయిన సంఘటనలు చూసి వైయస్‌ జగన్‌ కదిలారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు గెంటే ప్రయత్నం చేయడం.. కాంగ్రెస్‌ను కాదని తండ్రీకొడుకు మాత్రమే బయటకు వచ్చి.. ఆ తరువాత అభిమానించే ఎమ్మెల్యేలు, ఎంపీలు రావడం ఇలా.. వైయస్‌ఆర్‌ సీపీ జర్నీ మొదలైంది. 

అక్రమ కేసుల్లో వైయస్‌ జగన్‌ జైల్లో ఉన్నప్పుడు వైయస్‌ షర్మిలమ్మ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్ర ప్రజల ఆదరణతో వైయస్‌ జగన్‌ ముందుండి పోరాడి పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చాం. ఈ మధ్యలోనే కాంగ్రెస్‌ పార్టీ దుర్బుద్ధితో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. 2014–19 వరకు ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్లీ 2019లో జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ప్రజాతీర్పుతో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

తెలంగాణలో వైయస్‌ఆర్‌ సీపీపై మొదటి నుంచి ఆలోచనలు నడుస్తున్నాయి. ఈ విషయాన్ని మా పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాం. తెలంగాణలో వైయస్‌ఆర్‌ అభిమానులు చాలా మంది ఉన్నారు. అక్కడి ఆకాంక్షలు చాలా ఉన్నాయని చర్చించాం. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ చాలా క్లారిటీతో ఉన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయం, సహకారంతో సాధించుకోవాల్సినవి చాలా అంశాలు ఉంటాయి. ఉమ్మడి ప్రయోజనాలు, పరస్పర భిన్న ప్రయోజనాలు ఉంటాయి. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన. పార్టీ విస్తరణతో నష్టమే ఎక్కువగా వస్తుందని ముందు నుంచి చెబుతున్నారు. 

షర్మిలమ్మ వ్యక్తిగతంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అన్నాచెల్లెలి మధ్య విభేధాలు లేవు.. భిన్నాభిప్రాయాలు మాత్రమే. ఎలాంటి వ్యక్తిగత విషయాలు లేవు. పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉండాలా..? వద్దా..? ఉంటే దాని వల్ల వచ్చే లాభనష్టాలు..? వంటి అంశాలకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. షర్మిలమ్మకు పార్టీ పెట్టడం వల్ల వచ్చే కష్టాలు, నష్టాలు, పరిమితులపై నచ్చజెప్పాం. షర్మిలమ్మ కూడా రాజకీయ అనుభవజ్ఞురాలు. సుదీర్ఘకాలం ప్రజల మధ్య నడిచింది. వేరే పార్టీలతో వైయస్‌ఆర్‌ సీపీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు ఉండవు.. ఉండబోవు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

Back to Top