తాడేపల్లి: రాష్ట్రంలోని ఆదివాసీ సంఘాలు జీవో నెం.3కు శాశ్వత పరిష్కారం, 170 చట్టం పరిరక్షణ కోసం చేపడుతున్న ఉద్యమాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని రవిబాబు ప్రకటించారు. గిరిజనుల రాజ్యాంగ హక్కులను కాపాడడం కోసం ఆదివాసీలుకు తాము అండగా ఉంటామని ఆయన స్పష్టం చేసారు. తమ హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 7న గిరిజన ప్రాంతాల్లో ర్యాలీలకు, 8న రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చేపట్టనున్న బంద్ కు వైఎస్సార్ సీపీ పూర్తి సంఘీభావం తెలుపుతోందని, అలాగే గిరిజనులకు అండగా ఉంటామని ఆయన వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గిరిజన హక్కుల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, జీవో నెం.3, 1/70 చట్ట పరిరక్షణ అంశంపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు విస్మరించారని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాలు గడిచినా కనీసం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. గిరిజన భూములను రక్షించే 170 చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలై నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇంప్లీడ్ కాకపోవడం అనుమానాలకు తావిస్తోందని రవిబాబు వివరించారు. అంతేగాక మరోవైపు గిరిజనేతరులకు ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం గిరిజనుల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. జీవో నెం.3పై తాత్కాలిక జీఓలు సరికాదని, రాజ్యాంగ బద్దమైన ప్రెషిడెన్షియల్ ఆర్డర్ ను తీసుకురావాలని కుంభా రవిబాబు డిమాండ్ చేసారు. లేకుంటే గిరిజన ప్రాంతాలు భగ్గుమంటాయని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే... చంద్రబాబు ఒక్క ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం కూడా జరపలేదు ఎన్నికల సందర్భంగా జీవో నెం.3 పునరుద్ధరణ చేస్తామని ప్రచార సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలైనా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం కూడా నిర్వహించలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గిరిజనులను తప్పుదోవ పట్టిస్తూ మోసగించే ప్రక్రియ సాగిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో వేలాది మంది విద్యావంతులైన యువత జీవో నెం.3 రద్దు కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఇటీవల జరిగిన డీఎస్సీ నియామకాలలో కూడా గిరిజన యువత తీవ్ర నష్టాన్ని చవిచూసింది. 1/70 భూ బదలాయింపు చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలై నెలలు గడిచినా ప్రభుత్వం ఇంప్లీడ్ కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇప్పటికైనా కేంద్రానికి రాజ్యాంగ సవరణల ప్రతిపాదనలు పంపి గిరిజనులకు శాశ్వత న్యాయం చేయాలి. రాజ్యాంగ చట్టబద్ధతకు కేంద్రానికి శ్రీ జగన్ ప్రభుత్వం ప్రతిపాదనలు శ్రీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెం.3కు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా రాజ్యాంగపరమైన మార్గాలను పరిశీలించింది, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి, నిపుణులతో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలు ఇప్పటికీ ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా సరే వాటిని అధ్యయనం చేసి కేంద్రానికి పంపేందుకు ప్రస్తుత ప్రభుత్వం ముందుకు రావాలి. వైసీపీకి క్రెడిట్ వస్తుందనే అనుమానం మీకుంటే, మీరే ట్రైబల్ అడ్వజరీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్మించి తీర్మనాం చేసి కేంద్రానికి పంపి రాజ్యాబద్దమై హక్కు కలిగించే ప్రక్రియను చేపట్టవచ్చు. 2020లో సుప్రీంకోర్టు జీవో నెం.3ను రద్దు చేసిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు ప్రారంభించారు. అడ్వకేట్ జనరల్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసి, చట్టబద్ధమైన శాశ్వత పరిష్కారం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. కేవలం మరో జీవో ఇవ్వడం సరిపోదని, రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్లో అవసరమైన సవరణల ద్వారానే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అప్పుడే నిర్ణయించి కేంద్రానికి నివేదించారు. గిరిజనులకు అండగా వైఎస్సార్ కుటుంబం శ్రీ జగన్ ప్రభుత్వం జీవో నెం.3 విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న మంత్రి సంధ్యారెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు డాక్టర్ రాజీవ్ ధావన్ను సీనియర్ కౌన్సిల్గా నియమించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేశాం. . తెలంగాణ ప్రభుత్వం, పలు గిరిజన సంఘాలు కూడా అదే అంశంపై రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. అంతేగాక గిరిజనుల సంక్షేమం, అబివృద్ధి విషయంలో సీఎంగా జగన్ చిత్థశుద్దితో ప ని చేసారు. పాడేరులో మెడికల్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు, కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కళాశాల, ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వేల కోట్ల రూపాయలతో గిరిజన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం వంటి చర్యలు గిరిజన సమాజ అభివృద్ధికి నిదర్శనం. అటవీ హక్కుల చట్టం అమలులోనూ వైఎస్సార్ కుటుంబం చేసిన సేవలు మరువలేనివి. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న హయాంలో భారీ ఎత్తున అటవీ హక్కుల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం శ్రీ జగన్ ప్రభుత్వం కూడా లక్షల ఎకరాల భూమిపై గిరిజనులకు హక్కులు కల్పించింది. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక్క సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదు.