రాయలసీమ ఇప్పుడు గుర్తొచ్చిందా బాబూ? 

చంద్రబాబుకు చురకలంటించిన వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత 

నీ పాలనలో హంద్రీనీవాకు చేసిందేమిటి?

40 టీఎంసీలను 5 టీఎంసీలకు కుదించలేదా?

పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించలేదా?

సీమకు ఎయిమ్స్‌ వస్తే మంగళగిరి తీసుకెళ్లలేదా?

కర్నూలుకు హైకోర్టు కావాలంటే బెంచ్‌కు పరిమితం చేస్తున్నావ్‌..!

మూడ్రోజుల మహానాడులో కేవలం ఆత్మస్తుతి–పరనిందే

చంద్రబాబు సహా నేతల ప్రసంగాల్లో ‘జగన్నామస్మరణ’

ఈ నాలుగేళ్లు ఏమీ చేయలేడని తెలిసే ‘వైకుంఠపాళి’ కథలు

ఏడాదిగా సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయలేని ప్రభుత్వమిది

కూటమి మోసాన్ని వివరించేందుకు జూన్‌ 4న ‘వెన్నుపోటు దినం’

ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపు 

అనంతపురం : తాను రాయలసీమ వాసినని చంద్రబాబుకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అని వైయ‌స్ఆర్‌సీపీ   అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇన్నేళ్లలో రాయలసీమకు ఆయన చేసిందేంటని అన్నారు. సీమకు జీవనాడి అయిన హంద్రీనీవాను 5 టీఎంసీలకు కుదించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. శుక్రవారం వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కడపలో మూడు రోజుల పాటు నిర్వహించిన మహానాడు ఆత్మస్తుతి–పరనిందకు పరిమితం అయ్యిందన్నారు. ఎవరికి వారు పొగుడుకోవడం, వ్యక్తిగతంగా వైఎస్‌ జగన్‌ను విమర్శించడానికే మహానాడు వేదికను వాడుకున్నారని తెలిపారు. అధికారంలో ఉన్న ఒక పార్టీగా రాష్ట్రానికి ఏం చేయాలి? ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తాం? అనే ప్రస్తావనే లేదన్నారు. అది మహానాడు కాదు మహాడ్రామాగా అభివర్ణించారు. చంద్రబాబును లోకేష్‌.. లోకేష్‌ను చంద్రబాబు పొగుడుకుంటూ నేతలంతా మూడ్రోజులు జగన్మామస్మరణ చేశారని చురకలంటించారు. 

ఎన్టీఆర్‌ చివరి దశలో ఏం మాట్లాడారో తెలీదా?
మహానాడు సందర్భంగా ఎన్టీఆర్‌ను పెట్టి ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాయంతో విడుదల చేసిన వీడియోపై అనంత వెంకటరామిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్‌ చివరి దశలో చంద్రబాబును ఉద్దేశించి ఏం మాట్లాడారో ఆ వీడియోలు ప్రదర్శించి ఉంటే బాగుండేదని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే గతంలో ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించారని గుర్తు చేశారు. చివరకు ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని, ఆ తర్వాత మళ్లీ ఆయన్ను టీడీపీలోకి ఎప్పుడు చేర్చుకున్నారని ప్రశ్నించారు. ఈ రోజు ఎన్టీఆర్‌ భౌతికంగా లేరని, ప్రజలంతా గతాన్ని మరిచిపోయారని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. మోసం చేయడానికి ఎంతకైనా దిగజారవచ్చని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని, చివరకు ఆర్టిఫిషియ్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ని కూడా వాడుకున్నారన్నారు. 

హామీలు అమలు చేయలేకే ‘వైకుంఠపాళి’ కథలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకే చంద్రబాబు వైకుంఠపాళి కథలు చెబుతున్నారని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగాక ఏ ప్రభుత్వానికైనా కాలపరిమితి ఐదేళ్లు ఉంటుందని గుర్తు చేశారు. అందుకు తగ్గట్టుగానే హామీలు నెరవేర్చాలన్నారు. ‘‘ప్రజలు వైకుంఠపాళిగా ఉండొద్దు.. నేను హామీలు నెరవేర్చాలంటే అధికారం నుంచి నన్ను దించొద్దు.. మళ్లీ గెలిపిస్తేనే హామీలకు గ్యారంటీ’’ అని చంద్రబాబు చెప్పకనే చెప్పారన్నారు. అంతేకాకుండా మహానాడు వేదికగా భవిష్యత్‌ నాయకుడు నేను కాదు.. నారా లోకేష్‌యేనని సందేశం ఇచ్చారని అన్నారు. కానీ, గత ఎన్నికల్లో కార్యకర్తల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇక లోకేష్‌ తనకు తాను యువరాజులా భావిస్తూ ఆరు శాసనాలు అనడం.. దాన్ని గేమ్‌ఛేంజర్‌ అంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజాస్వామ్యంలో శాసనాలు ఉండవని గుర్తు చేశారు. 

సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయండి
రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడ్డాయని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై దృష్టిపెట్టాలని అనంత సూచించారు. ఏడాది కావస్తున్నా ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో 65 లక్షల మందికి పైగా పింఛన్లు అందిస్తుంటే ఏడాదిలోనే 3 లక్షల పింఛన్లకు కోత పెట్టారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా మే నెలలో తల్లికి వందనం ఇస్తామన్నారని గుర్తు చేశారు. ‘‘మే గడిచిపోయి జూన్‌ వస్తోంది. ఇక జూలైలో ఇస్తారో ఆగస్టులో ఇస్తారో.. అది కూడా ఒకేసారి ఇస్తారో? విడతల వారీగా ఇస్తారో?’ అని ఎద్దేవా చేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సాయం కూడా అందించలేదని తెలిపారు.  

రాయలసీమకు నువ్వు చేసిందేంటి?
40  ఏళ్ల రాజకీయ చరిత్రలో తాను రాయలసీమ వాసి అని చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకు రావడం సంతోషకరమైన విషయమని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అధికారంలో ఉండగా రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ‘‘ఎన్టీరామారావు సీఎం అయ్యాక గాలేరు నగరి, హంద్రీనీవాకు పునాదిరాయి మాత్రమే వేశారు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక వరుసగా 9 ఏళ్లు పాలన చేశారు. అప్పుడు గాలేరు నగరి, హంద్రీనీవాకు ఆయన చేసిందేంటి? ఒక కిలోమీటర్‌ అయినా ముందుకు తీసుకెళ్లారా? రెండు సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్నావు? చివరకు 40 టీఎంసీల హంద్రీనీవాను 5 టీఎంసీలకు కుదించిన చరిత్ర చంద్రబాబుది. కొత్తగా 2014లో ఏమైనా చంద్రబాబు సీఎం అయ్యారా? అదేదో వైఎస్‌ జగన్‌ నాలుగు సార్లు సీఎం అయినట్లు, ఆయన ఏమీ చేయలేదని అంటున్నారు?’’ అని చురకలంటించారు. రాయలసీమకు గుండెకాయ వంటి గండికోట రిజర్వాయర్‌పై చంద్రబాబు ఏనాడూ శ్రద్ధచూపలేదన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాకే 27 టీఎంసీలు తీసుకొచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పోలవరంకు ఈ రోజు ఈ గతి పట్టడానికి చంద్రబాబే కారణమన్నారు. చరిత్రలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను కుదిరించిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. హంద్రీనీవాను అనంతపురం, కర్నూలు జిల్లాకు పరిమితం చేసి గండికోట నుంచి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు నీరందించి హంద్రీనీవా అనుసంధానం చేసేలా సంకల్పించిన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు పనులు చేస్తుంటే కోస్తా జిల్లా నేతలతో కలిసి పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ధర్నాలు చేయించిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. హంద్రీనీవా కోసం వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఈ వాస్తవాన్ని దాచిపెడితే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘టీడీపీ హయాంలో రూ.4 వేలు ఖర్చు పెట్టామని అంటున్నారు. వాస్తవానికి 2014కు ముందే పనులు జరిగాయి. అప్పట్లో సవరించిన ధరల పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా సుమారు 1200 కోట్లను చంద్రబాబు చెల్లించారు. కానీ వాటిని కూడా తన హయాంలో పనులు జరిగినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు చేసిందేమీ లేదు’’ అని అనంత అన్నారు. 

కర్నూలులో హైకోర్టు బెంచ్‌తో సరిపెడతారా?
అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా వైఎస్‌ జగన్‌ హయాంలో కర్నూలుకు హైకోర్టును తీసుకొస్తే దాన్ని అమరావతిలో పెట్టి కేవలం బెంచ్‌ పరిమితం చేస్తున్నారని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు రాయలసీమకు ఎయిమ్స్‌ మంజూరైతే దాన్ని మంగళగిరి తరలించారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ఈ రోజు రాయలసీమకు ఏదో చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వరదలు వస్తే అమరావతి మునిగిపోకుండా ఉండేందుకు అక్కడ కాలువలను 50 మీటర్లు.. 100 మీటర్లతో నిర్మిస్తున్నారని తెలిపారు. కానీ రాయలసీమకు ఉపయోగపడే హంద్రీనీవాను ఎందుకు వెడల్పు చేయడం లేదని ప్రశ్నించారు.  

చంద్రబాబు సీఎం అయితే వెన్నుపోటు ఖాయం
చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా వెన్నుపోటు ఖాయమని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన విషయాన్ని గుర్తు చేశారు. 2014లో సీఎం అయ్యాక మహిళలు, రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేశారన్నారు. ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చి అమలు చేయకుండా వెన్నుపోటు పొడుస్తున్నారని తెలిపారు. వైకుఠపాళి ఆడొద్దని చెబుతున్నారంటే వచ్చే నాలుగేళ్లలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని అందించలేమని చెప్పకనే చెబుతున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో ఏకంగా రూ.2.72 లక్షల కోట్లను డీబీటీ ద్వారా పేదలకు అందించామని గుర్తు చేశారు. కానీ నేడు పేదలకు సంక్షేమం అందడం లేదన్నారు. గతంలో ఎన్నికల్లో హామీలు ఇచ్చి వైఎస్‌ఆర్, వైఎస్‌ జగన్‌లు అమలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు చంద్రబాబును పొగిడితేనో.. మమ్మల్ని విమర్శిస్తేనో ఏమీ రాదని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయకపోతే మీరే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. 

నీ రెడ్‌బుక్‌ చూసి భయపడం
రాష్ట్రంలో నిన్ను చూశో.. నీ రెడ్‌బుక్‌ను చూశో భయపడేవాళ్లు ఎవరూ లేరని నారా లోకేష్‌కు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నిరంకుశ ధోరణిలో వెళ్లడాన్నే తాము ప్రశ్నిస్తున్నామన్నారు. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇప్పటికే న్యాయస్థానాలు కూడా తప్పు పడుతుండడాన్ని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా లోకల్‌ బాడీ ఎన్నికలు జరిపితే ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.  

జూన్‌ 4న ‘వెన్నుపోటు దినం’
మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరిస్తూ.. జూన్‌ 4వ తేదీన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు ప్రజలను భాగస్వామ్యం చేసుకుని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Back to Top