తాడేపల్లి: కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా నూతనోత్సహం నెలకొంది. నేటి నుంచి కొత్త జిల్లాలను అమలులోకి తెస్తూ... ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యలయం వద్ద పార్టీ జెండాలు చేతబూని కార్యకర్తలు నృత్యాలు చేశారు. బాణసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన జిల్లాల ఏర్పాటు చేయడం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు,శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ నూతన జిల్లాల ఏర్పాటు చేస్తూ ప్రకటన చేయగానే పార్టీ నేతలు,కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు సంబరాలు చేసుకున్నారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఓ చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నూతన జిల్లాల ఏర్పాటు అంశాన్ని నెరవేర్చిన ఘనత శ్రీ వైయస్ జగన్ కే దక్కుతుందని అన్నారు. భారతదేశంలో మరెక్కడా లేని విధంగా పరిపాలన ప్రజలకు చేరువ చేయాలనే ధ్యేయంతో, తొలిగా గ్రామసచివాలయాలను,వాలంటీర్ల వ్యవస్ధను తీసుకువచ్చిన ఘనత జగన్ గారిదేనని అన్నారు. నేడు నూతన జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటుచేస్తున్నారన్నారు. జిల్లాకేంద్రంకు వెళ్లాలంటే వందలకిలోమీటర్లు వెళ్లి రోజుల తరబడి వేచిఉండే పరిస్ధితికి ఇకపై కాలం చెల్లే విధంగా నూతన జిల్లాల ఏర్పాటునిర్ణయం జరిగిందన్నారు. జవాబుదారీ తనం ఉండాలనే ధ్యేయంతోనే ఈరోజు 26 జిల్లాలను ఏర్పాటుచేశారన్నారు. ఈ నిర్ణయం పట్ల రాష్ర్ట వ్యాప్తంగా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నారన్నారు. ప్రభుత్వ పధకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కుల,మత,ప్రాంత,పార్టీలకతీతంగా అందిస్తున్నారని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా దీనికి మధ్దతు పలుకుతున్నారని తెలిపారు. ప్రతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాలర్ ఎగరేసుకునే రీతిలో ఈ నిర్ణయం ఉందన్నారు. ఇది దేశానికే ఆదర్శప్రాయం అన్నారు. ఈ కార్యక్రమంలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణ మూర్తి, పార్టీ విజయవాడ సిటీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్,పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ,పార్టీ నేతలు చిన్నపరెడ్డి, అభిమానులు,కార్యకర్తలు పాల్గొన్నారు.