ప్రభుత్వాని కన్నా మీ ఇబ్బందులు ఎక్కువని....

వరుసగా మూడో ఏడాది వైయ‌స్సార్‌ నేతన్న నేస్తం  అమ‌లు

అర్హత ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఆర్ధిక సాయం  

 ఈ ఏడాది 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను  నేరుగా వారి ఖాతాలో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

తాడేప‌ల్లి:కరోనా కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు కన్నా... చేనేతలు బతకడానికి పడుతున్న ఇబ్బందులు ఎక్కువ అని భావించామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. వారికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతో ఎన్ని ఇబ్బందులున్నా వరుసగా మూడోసారి  ఈ 80వేల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామ‌న్నారు. ఇలా ఏటా దాదాపుగా రూ.200 కోట్లు చొప్పున 5 ఏళ్లకాలంలో రూ.1000 కోట్ల రూపాయలు కేవలం నేతన్న నేస్తం ద్వారానే ఇస్తున్నామ‌ని తెలిపారు.  మూడో విడ‌త వైయ‌స్ఆర్ నేత‌న్న నేస్తం ప‌థ‌కం కింద మంగ‌ళ‌వారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేనేత‌ల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్క‌రికి రూ.24 వేల చొప్పున కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కి నేరుగా జ‌మ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వ‌ర్చ‌వ‌ల్‌గా చేనేత‌ల‌తో మాట్లాడారు.

80వేల కుటుంబాలకు లబ్ధి
ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. దాదాపుగా 80 వేల మంది చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది. ఒక్కొక్కరికి రూ.24వేల చొప్పున దాదాపు రూ.192 కోట్లు వారి ఖాతాల్లోకి జమచేస్తున్నాం. చేనేతలు పడుతున్న అవస్ధలు నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చూశాను. ప్రతి జిల్లాలోనూ చేనేత సమస్యలు నాకు చెప్పుకున్నారు. వారి గోడును బహుశా నేనెప్పటికీ మరిచిపోలేను.
నా పాదయాత్రలోనూ, ఎన్నికల మేనిఫెస్టోలోనూ..  ఎన్నికల్లో ఏదైతే చెప్పామో... అవన్నీకూడా ఎన్నికలు కాగానే అమలు చేయడం మొదలుపెట్టాం.

వరుసగా మూడో సంవత్సరం..
అందులో ఒక మంచి కార్యక్రమమే నేతన్న నేస్తం. ఈ రోజు వరుసగా 3వ సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన, ఆ మగ్గం మీద బతుకుతున్న చేనేత కుటుంబానికి సంవత్సరానికి అక్షరాల రూ.24వేల ఆర్థిక సహాయాన్ని చేస్తున్నాం. మూడేళ్ల పాలన పూర్తి కాకముందే, కేవలం 2 సంవత్సరాల 2 నెలల్లో వరుసగా మూడో విడత నేతన్న నేస్తం డబ్బులు విడుదల చేస్తున్నాం.
ఈ సొమ్ము మన నేతన్నలు మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను.

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా..
ఇలాంటి కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయడంలేదు. మన రాష్ట్రంలో దీన్ని మీ బిడ్డగా అమలు చేస్తున్నాను. రూ.24 వేలు చొప్పున ఇచ్చే ఈ సొమ్ము మూడు దఫాలుగా నేతన్ననేస్తం ద్వారా దాదాపుగా రూ.72 వేలు ఈ ఒక్క పథకం ద్వారానే ఇచ్చాం. ఇదే సొంత మగ్గం ఉండి, ఆ మగ్గమే ఆధారంగా బతుకున్న వారికి ఐదేళ్ల కాలంలో దాదాపుగా రూ.1.20 లక్షలు ఈ ఒక్క స్కీంద్వారానే అవినీతికి తావులేకుండా, వివక్షకు తావులేకుండా, బ్యాంకులు పాత అప్పులకు జమచేసుకోకుండా.. అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఖాతాల్లోకి నేరుగా డబ్బు పంపించడం జరుగుతోంది.
నేతన్న నేస్తం పథకానికి లబ్ధిదారుల ఎంపిక చాలా పారదర్శకంగా జరిగింది.
 
ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే...
ఇంత పాదర్శకంగా చేసినప్పటికీ కూడా పొరపాటున ఎవరైనా మిగిలిపోయి ఉంటే.. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. సొంత మగ్గం ఉన్నవాళ్లు, దాని మీదే బతుకున్నవాళ్లు్.. వలంటీర్లు ద్వారా కానీ, గ్రామ సచివాలయానికి నేరుగా వెళ్లి కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ధిష్టమైన కాలపరిమితిలోగా వాళ్ల తనిఖీ పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను సచివాలయంలో సోషల్‌ ఆడిట్‌ కోసం ప్రదర్శిస్తున్నాం. 

మేలు చేసే ప్రభుత్వమిది
ఆ తర్వాత  కూడా ఇంకా ఎవరైనా ఒకరో, ఇద్దరో అర్హత ఉండి మిగిలిపోయి ఉంటే కంగారు పడాల్సిన పనిలేదు.  మీ బిడ్డ ప్రభుత్వం ఇది. ఎవరికైనా ఎలా మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఉంది.  అనర్హులకు రాకూడదు, అర్హత ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ కాకూడదు అని ఆరాటపడే ప్రభుత్వం ఇది. ఎవరైనా మిస్‌ అయితే ఇప్పటికైనా గ్రామ సచివాలయాలకు వెళ్లి.. దరఖాస్తు చేసుకోవచ్చు. నెలరోజుల పాటు గడువు ఇస్తాం. తనిఖీ పూర్తిచేసి.. అర్హత ఉంటే తర్వాత వారికి వచ్చేట్టుగా చేస్తాం. 

గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం
ఈ సందర్భంగా మరో రెండు విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వైయస్సార్‌ నేతన్న నేస్తం ద్వారానే ఇవ్వాళ్టితో కలుపుకుని దాదాపుగా రూ.600 కోట్ల రూపాయలు నేరుగా సహాయం అందించాం. అంతే కాకుండా 2 సంవత్సరాల 2 నెలల కాలంలో చేనేత సహకార సంఘాలకు, ఆప్కోకు గత ప్రభుత్వం బకాయిపడ్డ రూ.103 కోట్లను కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదిలోనే చెల్లించాం.

ఆప్కో ద్వారా..
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన మాస్కులకోసం, చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో సేకరించిన వస్త్రాలు, పిల్లల యూనిఫారమ్స్‌ కోసం కానివ్వండి.. ఇలా దాదాపుగా రూ.1600 కోట్ల రూపాయలు నేరుగా నేతన్నలకు మంచి చేసేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
1,06,400 మంది నేతన్నలకు పెన్షన్లు పెంచి ఇస్తున్న సొమ్ము కాకుండా, నేతన్నలకు ఇచ్చిన ఇళ్లపట్టాలు, ఇంటి నిర్మాణాలు, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన ఇవన్నీ లెక్కలోకి వేసుకోకుండా.. కేవలం నేతన్న నేస్తం, ఆప్కోల ద్వారానే జరిగే మేలు దాదాపుగా రూ.1600 కోట్లు.

గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేనేత రంగం మీద, నేతన్నలకు వాళ్లు ఖర్చు చేసింది కేవలం రూ.259 కోట్లు మాత్రమే. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే... ఇది మీ బిడ్డ ప్రభుత్వం, మీ బాగోగుల కోసం ఆలోచించే ప్రభుత్వం ఇది అని చెప్పడానికి దీన్ని గుర్తు చేస్తున్నా.

ఆప్కో ఇ–మార్కెటింగ్‌ ప్లాట్‌ ఫాం

చేనేత రంగంలో నేతన్నల ఇబ్బందులు దూరం చేసేందుకు .. ఆప్కో ద్వారా ఇ– మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫాంను తీసుకు వచ్చాం.దీని ద్వారా ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు కల్పించాం. ప్లిప్‌ కార్ట్,  ఆమెజాన్‌లో ఆప్కో కనిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

చివరగా...
  ఇలా ప్రతి అడుగులోనూ కూడా మంచి చేయడానికి ఆరాటపడుతున్న మనందరి ప్రభుత్వానికి దేవుని చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నానంటూ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 

అనంతరం వైయ‌స్సార్‌ నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి  ఖాతాలో జమ చేశారు. 

ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం, చేనేత శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్,  పరిశ్రమలు,వాణిజ్యం (హేండ్‌లూమ్, టెక్స్‌ టైల్స్‌) కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, హేండ్‌లూమ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ పి అర్జునరావు, ఆప్కో ఛైర్మన్‌ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు, దేవాంగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బీరక సురేంద్ర, పద్మశాలి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జె విజయలక్ష్మి, తోగాటివీర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గెడ్డం సునీత, కుర్నిశాలి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బుట్టా శారదమ్మ, లేపాక్షి ఛైర్మన్‌ బి విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 

Back to Top