కుప్పంలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల్లో వైయస్‌ఆర్‌ సీపీ హవా 

విజయవాడ: కుప్పంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గ ప్రజలు భారీ షాక్‌లు ఇస్తున్నారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోనూ టీడీపీ దారుణ ఓటమి చెందింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జోరు కొనసాగుతోంది. కుప్పంలోని నాలుగు మండల్లాల్లో వైయస్‌ఆర్‌ సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైయస్‌ఆర్‌ సీపీ –17, టీడీపీ –2 సాధించాయి. గుడిపల్లె మండలంలో 12కి గాను 12 ఎంపీటీసీలు వైయస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంది. రామకుప్పం మండలంలో 16కి గాను 16 ఎంపీటీసీలు వైయస్‌ఆర్‌ సీపీ దక్కించుకుంది. శాంతిపురం మండలంలో 18కిగాను 11 ఎంపీటీసీలు వైయస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంది. 

నారావారిపల్లెలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరంపై వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి రాజయ్య 1,347 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అదే విధంగా కుప్పం మండలం టీ. సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైయస్‌ఆర్‌ సీపీ దక్కించుకుంది. టీడీపీ అభ్యర్థిపై 23 ఏళ్ల వయస్సు గల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అశ్విని 1,073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

చరిత్రలో తొలిసారి..
స్వర్గీయ ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు ఎంపీటీసీ స్థానాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. గ్రామాన్ని దత్తత తీసుకున్న నారా లోకేష్‌ను సైతం ఆ ప్రాంత ప్రజలు విశ్వసించకుండా.. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై కృతజ్ఞతతో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిని గెలిపించారు. చరిత్రలో తొలిసారి పామ్రరు ఎంపీపీ స్థానాన్ని వైయస్‌ఆర్‌ సీపీ దక్కించుకుంది. 

 

Back to Top