విజయనగరం: జిల్లాలో ఎరువుల బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) డిమాండ్ చేశారు. యూరియా సహా ఎరువుల కొరత, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం వైయస్ఆర్సీపీ నేతలు విజయనగరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ రూపంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోగా రైతులను మరిన్ని కష్టాలకు గురిచేస్తోంది. రైతులకు పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి రూ.20వేలు ఇస్తామని, జూన్,2024 నుంచే దీన్ని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పింది. ఈ రెండు సంవత్సరాలకు గాను ప్రతి రైతుకు రూ.40వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5వేలు మాత్రమే ఇచ్చారు. రైతులను ఈ రకంగా మోసం చేశారు. అంతేకాక 7లక్షల మందికి ఈ పథకాన్ని కోసేశారు. దీనివల్ల వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు అధిక వడ్డీలతో ప్రైవేటు అప్పుల మీద ఆధారపడే పరిస్థితిని సృష్టించారు. వీటితోపాటు ఏరైతుకూ గిట్టుబాటు ధర దొరకడంలేదు. రైతు తాను పండించిన పంటలను రోడ్డుమీద వేయాల్సిన పరిస్థితి. మా ప్రభుత్వంలో రైతుల్ని ఆదుకున్న ధరల స్థిరీకరణ నిధిని ఎత్తివేసి, రైతులను కష్టాల పాలు చేశారు. ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. గత ఏడాది ఇన్సూరెన్స్ను చెల్లించకపోవడంతో రైతులకు బీమా డబ్బులు రాని పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు రైతులకు సున్నావడ్డీ పథకాన్నికూడా ఎత్తివేశారు. రైతుకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ అండగా ఉన్న ఆర్బీకేల వ్యవస్థను పూర్తిగా నీరుగార్చారు. గ్రామస్థాయిలో రైతులకు చేదోడుగా ఉన్న వ్యవస్థలను ధ్వంసం చేశారు. వీటన్నింటితోపాటు రైతులకు ఎరువులను పంపిణీచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఎరువుల కొరతతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎరువులకోసం మళ్లీ రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు అందుబాటులో ఎరువులు ముఖ్యంగా యూరియా దొరక్కపోవడంతో ఎక్కడకు వెళ్లాలో రైతులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులను ప్రైవేటు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతులను దోపిడీ చేస్తున్నారు. యూరియా కేటాయింపులకు, సరఫరాకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పొటాష్ కలిసిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. బఫర్ స్టాక్ నిర్వహణ లోపం కారణంగా యూరియా ధరలను సైతం వ్యాపారస్తులు పెంచేస్తున్నారు. యూరియా బస్తాపై బ్లాక్ మార్కెట్లో రూ.60 నుంచి రూ.100 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రైతాంగం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, అధిక రేట్లు పెట్టి ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద ఎరువులు కొంటున్నారు. ఉన్న అరకొర ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాల వద్ద అన్నదాతలు పడిగాపులుకాస్తున్నారు. ఎర్రటి ఎండల్లో క్యూల్లో నిలబడలేక కొంత మంది సొమ్మసిల్లి పడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులు కళ్లముందు కనిపిస్తున్నా, ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా దీనిపై కథనాలు వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం స్పందంచడంలేదు. కళ్లముందు కనిపిస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించకుండా కక్షసాధింపు రాజకీయాలు, డైవర్షన్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతులు ఓవైపు కష్టాలు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షలు చేసే పరిస్థితికూడా కనిపించడంలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకున్నట్టుగా ఎక్కడా కనిపించలేదు. రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం చాలా ఉదాసీనతతో వ్యవహరిస్తోంది. డిమాండ్స్:- రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వెంటనే ఎరువులను అందుబాటులో ఉంచాలి. యూరియా కొరతను వెంటనే నివారించాలి. అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి, గ్రామస్థాయి వరకూ పంపిణీపై దృష్టిపెట్టాలి. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, కొరత ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు ఉంచాలి. అక్కడే రైతులందరికీ అందజేయాలి. ఎరువుల బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలి. బ్లాక్ మార్కెట్ కు తరలించే వారి లైసెన్సులు రద్దు చేయాలి. వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలి. ఎరువుల నిల్వలపై వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి. ప్రత్యేక నిఘా ఉంచాలి. ఎరువుల నిల్వలను రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక యాప్ లేదా, వెబ్ సైట్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. వీటితోపాటు ఉచిత పంటల బీమాను అమలు చేయాలి. గత ఏడాది రైతు భరోసా డబ్బుల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి. తదుపరి అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా ఎప్పుడిస్తారో ప్రకటించాలి. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకూ తాను ప్రతి ఏటా తాను ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వాలి. తొలగించిన 7 లక్షల మంది లబ్దిదారులకు వెంటనే పెట్టుబడి సహాయాన్ని వారి ఖాతాల్లో జమచేయాలి. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన, జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పి.ఏ.సి మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), శాసన మండలి సభ్యులు డా.పెనుమత్స సురేష్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడు, జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు పాల్గొన్నారు.