వైయ‌స్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ పాదయాత్ర

పెన్నహోబిలం నుంచి కసాపురం వరకు 50 కిలోమీటర్లు నడుస్తున్న అభిమాని శ్రీనివాస్ రెడ్డి

108 కొబ్బరికాయలు కొట్టి యాత్ర ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే సతీమణి భువనేశ్వరి

ఉరవకొండ:   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ఉరవకొండ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త వై. విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని కోరుతూ అభిమాని శ్రీ‌నివాస‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు.  వైయ‌స్ జ‌గ‌న్ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర ఉరవకొండ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం క్షేత్రం నుంచి జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కసాపురం ఆంజనేయస్వామి దేవాలయం వరకు 50 కిలోమీటర్ల మేర నడుస్తున్నారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉరవకొండ సమన్వయకర్త వై. విశ్వేశ్వరరెడ్డి సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. ఆలయ ఈఓ విజయ్ కుమార్ వారికి స్వాగతం పలికారు. ముందుగా పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో  ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆమె చేతుల మీదుగా 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం 50 కిలో మీటర్లు 5 రోజుల పాటు సాగే పాదయాత్రను మాజీ ఎమ్మెల్యే సతీమణి, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రారంభించి శ్రీనివాస్ రెడ్డి కి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న వైయ‌స్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పారు.  ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఎంతో కష్టించి పని చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మరోసారి ఎమ్మెల్యే అయితేనే ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ వజ్రకరూరు యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రంగనాథ్ యాదవ్, రమేష్, ప్రభాకర్, నరసింహులు, లక్ష్మీ నారాయణ, ఆదినారాయణ, ఓబులేసు, సుధాకర్,ఇతర నాయకులు, కార్యకర్తలు కలిసి కాసేపు నడిచి సంఘీభావం తెలిపారు.

Back to Top