ఏపీ నుంచి 42 వేల టన్నుల అరటి ఎగుమతులు

రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేసే గ్రాండ్‌–9 అరటి పండ్లకు విదేశాలలో మంచి డిమాండ్‌ ఉన్న విషయం వాస్తవమేనా అని రాజ్యసభలో వైయస్‌ఆర్‌ సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2020–21లో 42 వేల 935 మెట్రిక్‌ టన్నుల అరటి పండ్లు ఎగుమతి అయినట్లు వాణిజ్య శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్‌ తెలిపారు. అరటి వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం నిరంతరం జరిగే ప్రక్రియ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

‘‘అగ్రికల్చరల్, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రాడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అపెడా) వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేసే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. అరటి ఎగుమతులను ప్రోత్సహించడానికి అపెడా పలు చర్యలు చేపడుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విధానం కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాను ఎగుమతులకు అనువైన అరటి సాగుకు సానుకూలమైన ప్రాంతాలుగా అపెడా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి అరటి ఎగుమతుల కోసం అనేక చర్యలు చేపడుతోంది’’ అని కేంద్రమంత్రి వివరించారు.

జాతీయ పరిశోధనా సంస్థలు, ఉద్యానవన విశ్వవిద్యాలయాల సహకారంతో అరటి సాగును ప్రోత్సహిస్తోందన్నారు. ఎగుమతులు చేయగల సామర్ధ్యం కలిగిన వారిని కూడగడుతోందని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సర్టిఫికేషన్‌కు అవసరమైన సాగు విధానాలను అమలు చేస్తోందన్నారు. అలాగే క్రయ–విక్రయదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎంపిక చేసిన అరటి సాగు క్లస్టర్లలో నూరు శాథ టిస్యూ కల్చర్‌ అరటిని సాగు చేసేందుకు ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. అరటి ఎగుమతుల రవాణాకు వీలుగా ముంబైలోని పోర్టుకు నేరుగా ప్రత్యేక రైలును ప్రవేశపెట్టినట్లు కేంద్రమంత్రి వివరించారు.

లక్షా 57 వేల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు...
భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ కింద దేశంలో లక్షా 57 వేల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ కల్పించినట్లు పంచాయతీ రాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేష్వర్‌ పాటిల్‌ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2023 ఆగస్టు నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించే విధంగా భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 9 నాటికి దేశంలో లక్షా 57 వేల 919 గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ ఫేజ్‌ 1 కింద కేవలం అండర్‌ గ్రౌండ్‌ ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ కింద గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు కల్పించే పనులు చేపట్టడంతో రైట్‌ ఆఫ్‌ వే సమస్యలతో ప్రాజెక్ట్‌ అమలులో సమస్యలు తలెత్తినట్లు కేంద్రమంత్రి చెప్పారు. భారత్‌నెట్‌ ఫేజ్‌ 2 కింద ఆంధ్రప్రదేశ్‌తో సహా 8 రాష్ట్రాలలో 65 వేల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సారధ్యంలో అమలు జరుగుతోంది. అయితే నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు జరగనందున ప్రాజెక్ట్‌ గడువుపై దాని ప్రభావం పడుతోందని చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top