చిన్నారి కౌశిక్‌ను పరామర్శించిన వైవీ సుబ్బారెడ్డి

ఎంత ఖర్చైనా  బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం

తిరుమల: తిరుమలలో అయిదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనపై వ‌య‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. చిరుత దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు కౌశిక్‌ను శుక్రవారం ఉదయం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడని తెలిపారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. 

ఎంత ఖర్చైనా  బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మరో రెండు రోజుల్లో క్షేమంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్ అయ్యే అవకాశం ఉందన్నారు. బాలుడి‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పామని అన్నారు. అదే విధంగా తిరుమలలో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మెట్ల మార్గంలో జంతవులు తిరిగే చోట ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నడక మార్గంలో భద్రతను మరింతగా పెంచుతామని తెలిపారు. 

కాగా తిరుమలలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఆదోనికి చెందిన భక్తులు అలిపిన నడకమార్గంలో వెళ్తండగా బుధవారం బాలుడిని చిరుత లాక్కెళ్లింది. భక్తులు కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలో కొద్ది దూరంలో వదిలేసి వెళ్లింది. చిరుత దాడిలో బాలుడి చెవి వెనక, మెడకు, తలకు గాయాలయ్యాయి. పద్మావతి చిల్ట్రన్‌ ఆసుపత్రిలో బాలుడు కౌశిక్‌కు చికిత్స అందిస్తున్నారు.
 

Back to Top