ఇడుపులపాయ : పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం.. అలుపెరగకుండా శ్రమిస్తున్న వేముల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సహకారం అందిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా.. శుక్రవారం ఉదయం ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవాన్ని ముగించుకుని ఇడుపులపాయ నెమళ్ల పార్కు వద్దకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. అక్కడి ప్రేయర్ హాలులో వేముల మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి.. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముందుగా.. సొంత నియోజకవర్గ ప్రజలపై ఉన్న మమకారం, స్థానిక బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఒకేచోట కలిసిన ఆనందంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. నియోజకవర్గ నాయకులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. "దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక.. మీరంతా అందించిన ప్రోత్సాహం, సహకారం, మనోధైర్యంతో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచి మీ అందరి మేలు కోసం పాటుపడుతున్నాను..."" అంటూ.. పులివెందుల సొంత నియోజకవర్గంలోని వేముల మండల ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సవినయంగా తెలియజేశారు. ఈ సందర్బంగా.. పాడా అభివృద్ధి పనుల పురోగతిపై.. రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు క్లుప్తంగా వివరించగా... వేముల మండలం పరిధిలో పాడా, ఇతర శాఖల ద్వారా జరుగుతున్న మొత్తం అభివృద్ధి పనుల పురోగతిపై.. పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం పలువురు నాయకులు.. మండలంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వగా... పలువురు నాయకులు పలు అంశాలపై ముఖ్యమంత్రికి వినతి పత్రాలను అందివ్వడంతో పాటు, నేరుగా ముఖ్యమంత్రికి విన్నవించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. నాలుగున్నర సం.కాలంలో వేముల మండల పరిధిలోని రోడ్లు, డ్రైనేజీలు పనులు పూర్తి అయ్యాయని నల్ల చెరువు దగ్గర బ్రిడ్జి పనులు త్వరతిగతిన జరుగుతున్నాయని తెలిపారు. పెర్ణపాడు దగ్గర వేర్ హౌస్,ఐటిఐ ,జూనియర్ కాలేజ్ లు నూతనంగా నిర్మించడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.వేములలో తిరునాలగుట్ట బాగా అభివృద్ధి చెందిందనీ,9 సచివాలయాలలో 5 సచివాలయాలు పూర్తి అయ్యాయ్యని మిగతావి అభివృద్ధి దశలో వున్నాయని తెలిపారు. పెంచికల బసిరెడ్డి కాలువ (పివిసి) లో మొక్కలు పెరిగాయని,డిస్ట్రిబ్యూటర్లకు క్లీన్ చేయించాలని,సిమెంట్ లైన్ నిర్మించాలని కోరారు.నల్లచెరువు గ్రామం పరిధి లో 1600 ఎకరాలు వున్నాయని అవి పై తట్టు ప్రాంతం లో వుండడం వలన నీరు అందడం లేదని పివిసి ద్వారా లిఫ్ట్ చేయించాలని కోరారు. మండలంలో 76 సంపులు లలో ఐదు పూర్తి అయ్యాయని మొత్తం అభివృద్ధి చేస్తే 15 వేల ఎకరాలను సాగు నీటిని అనుకూలంగా వుంటుందన్నారు. పెండ్లూరు చెరువు కు కుడి ఎడమ కాలువ లని ఏర్పాటు చేస్తే 1100 ఎకరాలకు అయుకట్టు కిందకి వస్తాయని కోరారు. అలాగే గాలేరు నగరి కెనాల్ నుండి నారాపల్లి చెరువుకు నీటిని లిఫ్ట్ చేస్తే మరికొన్ని ఎకరాలు సాగు చేయొచ్చని తెలిపారు. వేముల సమీపంలో మినరల్స్ ఎక్కువగా వున్నాయని బైరటీస్,లైమ్ స్టోన్ వంటి ఖనిజాలను సంబందించి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉపాధి లభిస్తోందని కోరారు. పత్తికి సీజనల్ క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింప జేయాలని,రబీలో మినుములు,పెసర రైతులకు రాయితీలు కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో రైతుల ఇన్పుట్ సబ్సిడి,ఇన్సూరెన్స్ పై అతి తక్కువ ఖర్చు చేశారని,ఈ నాలుగున్నర లో రూ.7800 కోట్లు ఖర్చు చేసామని అన్నారు.""వేముల పరిసర ప్రాంత గ్రామాల్లో.. గ్రామస్థులకు, రైతులకు ఎదురయ్యే సమస్యలను పూర్తి వివరాలతో స్వీకరించి.. అందుకు అధికారులు చేపట్టే పరిష్కార మార్గాలు, ఫలితాలు బాధితులకు సంతృప్త స్థాయిలో ఉన్నాయో లేదో.. వారితో నిర్ధారించుకొని.. ముందుకు సాగాలన్నారు. వారికి అందాల్సిన పరిహారం కూడా అందించేలా.. ఈ ప్రక్రియ రానున్న నాలుగు నెలల్లో పూర్తి చేయాలని.. ఇరిగేషన్ సంబందిత అధికారులను ఆదేశించారు. "" అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ, ప్రణాళికా ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.... అందుకు అన్ని వర్గాల ప్రజలు సమ్మతి, సహకారం ఎంతో అవసరం అన్నారు. గ్రామ లోగిళ్ళలోనే.. గ్రామ సచివాలయాల ద్వారా.. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజలకు అందివ్వడం జరుగుతోందన్నారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే.. ఎక్కడా వివక్షకు తవివ్వకూడదని సూచించారు. పరిపాలన పారదర్శకంగా సాగినపుడే.. ప్రజా వ్యవస్థ పటిష్ఠంగా సాగుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా.. అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి ఎలాంటి తావులేకుండా.. కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా అలుపెరుగకుండా శ్రమిస్తున్న వైసిపి నాయకులకు, అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమం చివరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ నెల 14 నుండి 20 వరకు జరిగే 56 వ గ్రంధాలయ వారోత్సవాల పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపి అవినాష్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేసీ గణేష్ కుమార్,అసిస్టెంట్ కలెక్టర్ భరద్వాజ్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, జెడ్పిటిసి కొగటం వెంకట భయపు రెడ్డి,వేముల మండల ఇంఛార్జి ఎన్ సాంబ శివా రెడ్డి,వేముల మాజీ మండల ఉపాధ్యక్షుడు లింగాల రామ లింగా రెడ్డి,జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ లింగాల ఉషా రాణీ,పొల్యూషన్ బోర్డు ఛైర్మెన్ ఏం.శివ కృష్ణా రెడ్డి,మాజీ జెడ్పిటిసి మోరం రెడ్డి రాజా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.