నర్సీపట్నం: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పై టీడీపీ గూండాల దాడిని ఉత్తరాంధ్ర వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉత్తరాంధ్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా దాడుల సంస్కృతిని కూటమి నాయకులు తీసుకొచ్చారని మండిపడ్డారు. నర్సీపట్నంలోని ఉమా శంకర్ గణేష్ నివాసంలో పార్టీ నాయకులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, మలసాల భరత్ లు ఆయన్ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతోనే గణేష్ పై టీడీపీ గూండాల దాడి చేశారని, దాడి చేసిన వారి నేపథ్యం చూస్తే గణేష్ను అంతం చేయడానికే వచ్చినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై దాడి చేసిన వాళ్లంతా మర్డర్, గంజాయి కేసులున్న గూండాలు, రౌడీలేనని.. పోలీసుల సమక్షంలోనే చంపుతామని బెదిరించడంతోపాటు ఆయన కారును ధ్వంసం చేశారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని, దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించేదాకా వైయస్ఆర్సీపీ పోరాడుతుందని వివరించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ చెరువులో స్పీకర్ కుటుంబ సభ్యులు అక్రమ నిర్మాణాలు చేయడమే కాకుండా దాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు ఉమా శంకర్ గణేష్పై దాడి చేయడం హేయమన్నారు. ప్రెస్మీట్ అనంతరం నాయకులంతా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ● వైయస్ఆర్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ - అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నందుకే టీడీపీ గూండాల దాడి హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ అక్రమంగా మట్టి తరలించడాన్ని వ్యతిరేకించినందుకు వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్పై టీడీపీ గూండాలు దాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు వారి తరఫున నర్సీపట్నం ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు చేస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నందుకే ఆయనపై టీడీపీ గూండాలు ఈ దుశ్చర్యకు చేశారు. ప్రజలకు చెందిన చెరువులో అక్రమ నిర్మాణాలు చేస్తుంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా గణేష్ ప్రజల పక్షాన అడ్డుకుని దోపిడీకి ఎదురు నిలబడ్డారు. గంజాయి, మర్డర్ కేసుల్లో ఉన్నవారు, మర్డర్ కేసుల్లో గతంలో జైలు జీవితం అనుభవించి వచ్చిన వారంతా కలిసి వచ్చి ఒక్కసారిగా ఆయనపై దాడికి తెగబడ్డారు. అయ్యన్నపాత్రుడు నిన్ను చంపేయమన్నాడంటూ కర్రలు, రాడ్లు పట్టుకుని ఆయన్ను చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఆయన కారు మీద రాళ్లు విసిరి, ధ్వంసం చేశారు. వ్యక్తిగత సహాయకుడు సప్పా గణేష్ (బాబు)ను బయటకు లాగి గాయపరిచారు. ఉత్తరాంధ్రకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాడుల సంస్కృతిని కూటమి నాయకులు తీసుకొచ్చారు. ప్రజల పక్షాన పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యేపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. - గణేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే గణేష్ పై దాడి చేసిన వ్యక్తులందర్నీ గుర్తించడం జరిగింది. వారి పేర్లతో సహా వైయస్ఆర్సీపీనాయకులమంతా పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాం. ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి స్పీకర్ అయ్యన్నపాత్రుడు. నిందితులపై హత్యాయత్నం కేసులు పెట్టి చర్యలు తీసుకునేదాకా పోరాడుతాం. పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు గారు పరిస్తితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రెండు రోజుల్లో పోలీసుల నుంచి సరైన స్పందన రాకపోతే జిల్లా పార్టీ మొత్తం ఏకమై నర్సీపట్నం నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. పార్టీ మొత్తం గణేష్ కుటుంబానికి అండగా నిలబడుతుంది. - 21 నెలల్లో 720 హత్యలు కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తాం అనే ధోరణిలో చంద్రబాబు పాలన సాగుతోంది. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. 21 నెలల్లో 21 రాజకీయ హత్యలు జరిగాయి. మొత్తం 720 మందిని చంపేశారు. వైయస్ఆర్సీపీ నాయకుల మీద దాదాపు 4వేల అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ నాయకుల్లో రెండు గ్రూపులు ఘర్షణ పడిన కేసుల్లోనూ వైయస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా ఇరికిస్తున్నారు. కాపు నాయకుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసి 7 గంటలపాటు నిరంతరాయంగా చంపే ప్రయత్నం చేశారు. మరో బీసీ నాయకుడు జోగి రమేశ్ ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేసి వారి కుటుంబాన్ని లేకుండా చేసే ప్రయత్నం జరిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మా నాయకులు చేసిందే రాజ్యాంగం అన్నట్టు కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాడు వైయస్ఆర్సీపీ హయాంలో దేశంలో తొలిస్థానంలో ఉన్న ఏపీ పోలీస్ వ్యవస్థ నేడు దేశంలో అట్టడుగున ఉంది. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు. గతంలో కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా, సీనియర్ జర్నలిస్ట్ పింగలి దశరథ్రామ్ లను విజయవాడ నడిరోడ్డుపై హత్య చేసిన ఘటనల్లో అన్ని వేళ్లూ చంద్రబాబునే చూపిస్తున్నాయి. ● గణేష్ను అంతం చేసే కుట్ర - బూడి ముత్యాల నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఉత్తరాంధ్ర చరిత్రలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని తీసుకురావడాన్ని వైయస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయనపై దాడికి పాల్పడినవారంతా రౌడీషీటర్లు, గూండాలే. వారి నేపథ్యం చూస్తేనే గణేష్ను అంతం చేయడానికి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వమే హత్యా రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు. స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకునేదాకా ఊరుకునేది లేదు. ● పోలీసుల సమక్షంలోనే గణేష్పై దాడి - కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే కూటమి నాయకులకు చట్టాలన్నా, న్యాయ స్థానాలన్నా గౌరవం లేదు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నాయకులు పోరాడితే ప్రభుత్వానికి నిద్ర పట్టడం లేదు. అవినీతి, దౌర్జన్యాలను అడ్డుకుంటే కూటమి నాయకులు నచ్చడం లేదు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ప్రశ్నిస్తే ఓర్చుకోలేకపోతున్నారు. లోకేష్ పేరులో కేసు ఉందని మా నాయకుల మీద రెడ్ బుక్ రాజ్యాంగంతో కేసులు పెడుతూ పోతున్నారు. పోలీసుల సమక్షంలోనే ఆయనపై దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నట్టు? గౌరవప్రదమైన పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుసరిస్తున్న విధానాలు మంచిది కాదు. జిల్లా వైయస్ఆర్సీపీ మొత్తం గణేష్ కుటుంబానికి అండగా ఉంటుంది.