మణితేజది ముమ్మాటికీ రాజకీయ హత్యే

కోడి పందెం ముసుగులో గొడవ

వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడి హత్య!

ఆసుపత్రి వ‌ద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ఆందోళ‌న‌

 ఎన్టీఆర్:  కోడి పందెం ముసుగులో గొడ‌వ ప‌డి వైయ‌స్ఆర్‌సీపీ నేత మ‌ణితేజ‌ను ప‌చ్చ గూండాలు హ‌త‌మార్చారు.నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత మ‌ణితేజ‌ను టీడీపీ కార్య‌క‌ర్త‌లు దారుణంగా హ‌త్య చేశార‌ని, ఇది ముమ్మాటికి రాజ‌కీయ హ‌త్యే అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. ప్రశాంతంగా ఉన్న నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో టీడీపీ చిచ్చు పెట్టింది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పచ్చ గూండాలే హత్య చేశారు. విష‌యం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలు  నందిగామలోని ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మణితేజ మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు సహా పలువురు పరిశీలించారు. 

మణితేజ కుటుంబానికి అండగా ఉంటాం: దేవినేని అవినాష్ 
మణితేజది ముమ్మాటికీ రాజకీయ హత్యే. మణితేజ మృతిపై  మాకు అనేక అనుమానాలున్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ అన్నారు. మణితేజ కుటుంబం వైయ‌స్ఆర్‌సీపీలో క్రియాశీలకంగా ఉంటోంది. వారంతా పార్టీలో యాక్టివ్‌గా ఉండటం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు.  ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పొట్టనపెట్టుకున్నారు. మణితేజ హత్యను టీడీపీ, పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేయత్నం చేస్తున్నారు. మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించాల‌ని దేవినేని అవినాష్ డిమాండు చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి. మణితేజ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంద‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. మణితేజ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులదే. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మూడు సంక్రాంతులే. మళ్లీ వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి వస్తారు. తప్పుచేసిన వారికి చట్టపరంగా కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామ‌ని హెచ్చ‌రించారు. మణితేజ కుటుంబానికి చంద్రబాబు, పవన్, లోకేష్ సమాధానం చెప్పాలి. రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉంది ముగిసిపోలేదని లోకేష్ అంటున్నాడు. మనుషుల ప్రాణాలు తీయడమేనా రెడ్ బుక్ అంటే అని అవినాష్ ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. మణితేజ మృతిని ప్రమాదంగా చిత్రీకరించారు. తలపై బలంగా కొట్టినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. వైయ‌స్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు చేసినందుకు మణితేజను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కోడిపందాల వద్ద గొడవ తర్వాత మణితేజ చనిపోయాడు. మణితేజ మృతిని హత్య కోణంలోనే దర్యాప్తు చేయాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు.

జై జ‌గ‌న్ అంటే కేసులా?
 
జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేత‌లు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. జై జగన్ అంటే కేసులు పెడుతున్నార‌ని జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరావు పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ఫ్లెక్సీలను చించి తిరిగి మా పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మణితేజది ముమ్మాటికీ హత్యే. మణితేజ మృతిని హత్య కేసుగానే నమోదు చేయాలి. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను బెదిరిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 
 

Back to Top