తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే స్పష్టమైన ఆధారాలతో మీడియా సమావేశంలో పలు ప్రశ్నలు సంధించినా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. డీఎస్సీ పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా ఎంపికల వరకు పలు అంశాలపై ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతో వెలుగులోకి తెచ్చిన అంశాలకు వెన్నుపోటు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పకుండా సవాళ్లు, మాటలతో కాలయాపన చేయడం మానుకుని సీబీఐ విచారణకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. ప్రెస్మీట్లో వంగవీటి నరేంద్ర ఏమన్నారంటే.. - డీఎస్సీపై సీబీఐ విచారణకు ఎందుకు భయం? “వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు డీఎస్సీలో జరిగిన అవకతవకలపై చాలా స్పష్టమైన ఆధారాలతో ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ పేపర్ లీక్ అయిందా లేదా? పరీక్ష పేపర్ నిర్వహణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నారా లేదా? ఆ ప్రక్రియలో భాగమైన నవీన్ అనే వ్యక్తి డీఎస్సీ పరీక్ష ఎలా రాశారు? మెరిట్ లిస్ట్లో అతని పేరు ఉండి, తుది జాబితాలో ఎందుకు లేకుండా పోయింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వెరిఫికేషన్కు రాలేదని ఒకవైపు చెబుతూ, మరోవైపు కోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉండటంతో ప్రభుత్వ సమాధానాల్లోనే పొంతన లేకుండా పోతోంది. నిజంగా ఎలాంటి అక్రమాలు జరగలేదనే నమ్మకం ఉంటే, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు కోరిన సీబీఐ విచారణను ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదు?” - స్పోర్ట్స్ కోటా ఎంపికలపై సమాధానం చెప్పాలి “స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడలిస్టులను పక్కనపెట్టి పార్టిసిపెంట్లకు అవకాశాలు కల్పించారా లేదా ప్రభుత్వం స్పష్టం చేయాలి. సాఫ్ట్బాల్, జూడో అసోసియేషన్ల నుంచి వచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా ఎంతమందిని ఎంపిక చేశారు? మెరిట్ ఉన్న అభ్యర్థులను పక్కనపెట్టి అర్హత లేని వారికి ఎలా అవకాశం కల్పించారు? బ్లైండ్ కాకపోయినా బ్లైండ్ సర్టిఫికెట్ తెచ్చుకున్న వ్యక్తి సెలెక్షన్ లిస్ట్లో ఎలా చోటు సంపాదించారు? ఇవన్నీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు డాక్యుమెంటరీ ఆధారాలతో ప్రజల ముందుంచారు. ఆ ఆధారాలపై సమాధానం చెప్పకుండా సవాళ్లు విసరడం ద్వారా అసలు విషయాన్ని పక్కదారి పట్టించలేరు.” - పుత్ర వాత్సల్యంతో ప్రజల కష్టాలను పట్టించుకోని చంద్రబాబు “చంద్రబాబు నాయుడు గారి పుత్ర వాత్సల్యం ప్రజల కష్టాలను పక్కనపెట్టి తన కుమారుడి పదవి కోసం పనిచేసే స్థాయికి చేరింది. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, పేపర్ లీక్ కాలేదని నమ్మకం ఉంటే సీబీఐ విచారణకు అంగీకరించండి. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడిన అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. వారికి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్సీపీ అండగా నిలుస్తుంది, పోరాటం కొనసాగిస్తుంది. భవిష్యత్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారానికి బాధ్యులైన అధికారులు, మంత్రులు, సహకరించిన వ్యక్తులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెడతాం.”