తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో జరిగిన స్కామ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌనం వీడి స్పందించాలని, అలాగే జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర డిమాండ్ చేశారు. లేకుంటే నిరుద్యోగులు, యువత, విద్యార్థులతో కలసి వైయస్ఆర్సీపీ చంద్రబాబును, లోకేశ్ ను గద్దె దింపడం ఖాయమని స్పష్టం చేసారు. డిఎస్సీ కుంభకోణం నుంచి తన కుమారుడుని రక్షించుకోవడం ముఖ్యమా..? లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం ముఖ్యమా..? అన్నది చంద్రబాబు తేల్చుకోవాలని సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ, డీఎస్సీ-2025లో నిజంగా అవకతవకలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు ఆదేశించడానికి ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందుంచాలని, అన్యాయం జరిగిన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యార్థులు, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే... ప్రశ్నించే గొంతును అణిచి వేస్తే సహించేది లేదు డీఎస్సీ అంశంపై వైఎస్సార్సీపీ చేపడుతున్న ఆందోళనలకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణను చూసి ఓర్వ లేక ప్రభుత్వం అధికారంతో అడ్డుకోవడానికి దిగజారిపోయింది. నిరద్యోగులు, విద్యార్థులు వైయస్ఆర్సీపీ నేతలతో కలసి ర్యాలీ చేయడానికి ముందుగానే నోటీసులు ఇవ్వడం, నాయకులను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం, అక్రమ కేసులు నమోదు చేయడం ద్వారా ప్రశ్నించే గొంతును అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాల్. డీఎస్సీ-2025 కు ఎంపికైన అభ్యర్థులను వైఎస్సార్సీపీ తప్పుపట్టడం లేదు. అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులకు న్యాయం చేయడమే మా లక్ష్యం. అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించి డబ్బు, సమయం కోల్పోతున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెెళుతన్నా ఫలితం లేకుండా పోయింది. గత 74 రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి వైఎస్సార్సీపీ పలు దఫాలుగా నిరసనలు, ర్యాలీలు, టౌన్హాల్ సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, వినతిపత్రాల కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. జగన్ అడిగిన ప్రశ్నలకు బదులేది..? డీఎస్సీ నియామక ప్రక్రియను కేంద్రీకరించడం, ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడింగ్ వంటి కీలక ప్రక్రియల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఉపయోగించడం, స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 4 శాతానికి పెంచడం, పరీక్ష రాయుకుడానే అభ్యర్థులను ఎంపిక చేయడం, వెన్నుపోటు పార్టీ ప్రజాప్రతినిధులు నేతలుగా ఉన్న క్రీడాసంఘాల నుంచి అభ్యర్థులకు ఉద్యోగాలు రావడం, పోస్టుల బేరసారాలకు సంబందించి ఫోన్ ఆడియో, వీడియో లు బయటపడటం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిలదీసినా సరే ఇప్పటికీ ప్రభుత్వం తగు సమాధానం చెప్పలేకోపోవడం జరిగిన స్కామ్ కు బలం చేకూరుస్తోంది. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు సంగతేంటి..? డీఎస్సీ అంశంతో పాటు విద్యార్థులకు సంబంధించిన విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని కొన్ని విద్యాసంస్థలు చెబుతున్న పరిస్థితి దృష్ట్యా విద్యార్థులు తమ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. . విద్యార్థులు చదువుకోవాల్సిన సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యా, వసతి దీవెన కు రూ. 9,500 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఎగనామం పెట్టడం దురదృష్టకరం. అదేవిధంగా ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ప్రతీ నిరుద్యోగ అభ్యర్థికి నిరుద్యోగ భృతి నెలకు రూ.3,000 చొప్పున హామీ ఇచ్చి, ఇప్పటికీ చెల్లింపులు చేయకుండా ఎగవేసారు. ఒక్కో నిరుద్యోగ అభ్యర్థికి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 1.08 లక్షలు బకాయి పడింది. ఇలా రాష్ట్రంలోని 20 లక్షల నిరుద్యోగులకు భృతి చెల్లించకుండా చంద్రబాబు, లోకేశ్ మోసం చేసారు. కూటమి ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ చేపడుతున్న ప్రతి ప్రజా ఉద్యమాన్ని వేరే అంశాలతో మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ సంయమనం పాటిస్తూ ప్రజాస్వామ్య, న్యాయబద్ధ మార్గాల్లో పోరాటం కొనసాగిస్తుంటుందని హెచ్చరిస్తున్నాం.