తిరస్కరిస్తున్నా.. సిగ్గురావడం లేదా బాబూ..!

చంద్రబాబు తుంటరి ఆటగాడిలా మిగిలిపోతాడు

వ్యవస్థలను భ్రష్టుపట్టించే వ్యక్తులనే బాబు నమ్ముతాడు

కౌంటింగ్‌ రోజు గందరగోళం సృష్టించేందుకు టీడీపీ కుట్ర

వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి

అధికారంలోకి రాగానే టీడీపీ నేతల అవినీతి కక్కిస్తాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

విజయవాడ: న్యాయస్థానాలు ఎన్ని పిటీషన్లు తిరస్కరిస్తున్నా చంద్రబాబుకు సిగ్గురావడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. ఓడిపోయే ముందు ఎందుకంత ప్రెస్టేషన్‌కు గురవుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో చంద్రబాబు ఒక తుంటరి ఆటగాడిలా మిగిలిపోతాడన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రగిరిలో రీపోలింగ్‌కు ఆదేశిస్తే అన్యాయం, అక్రమం అని చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని, తరువాత కోర్టులో పిటీషన్‌ వేస్తే న్యాయస్థానం తిరస్కరించిందన్నారు. అంతకుముందు వీవీ ప్యాట్‌లు ఐదు కాదు 50 లెక్కించాలని కోర్టుకు వెళ్లారని, దానిపై కోర్టు చురకలు అంటించిందన్నారు. నిన్న ఒక టెక్నీషియన్‌ చేత చంద్రబాబు బృందం వందశాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాలని ఒక పిటీషన్‌ వేయించిందని, గౌరవ అత్యున్నత న్యాయస్థానం అది సాధ్యం కాదని ఒక ఆర్డర్‌ పాస్‌ చేసిందని, విలువైన కోర్టు సమాయాన్ని వృథా చేయవద్దని నోటీస్‌ కూడా రిలీజ్‌ చేసిందన్నారు. అయినా చంద్రబాబుకు సిగ్గురావడం లేదన్నారు. 

చంద్రబాబు ప్రజాస్వామ్య దేశంలో ఒక తుంటరి ఆటగాడిలో మిగిలిపోతాడని అంబటి అన్నారు. వీవీ ప్యాట్‌లు, ఈవీఎంలు, ఎలక్షన్‌ కమిషన్, ఎగ్జిట్‌ పోల్‌ దేనిపై చంద్రబాబుకు నమ్మకం లేదని, ఆఖరికి న్యాయస్ధానాలను కూడా చంద్రబాబు నమ్మడం లేదన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు, నారా లోకేష్‌లను మాత్రమే చంద్రబాబు నమ్ముతాడన్నారు. తానుచెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. ఓటమి భయంతో మమతా బెనర్జీ, స్టాలిన్, కుమారస్వామి అంటూ దేశమంతా తిరుగుతున్నాడన్నారు. ఇంట్లో గెలిచే పరిస్థితి లేని చంద్రబాబు దేశమంతా తిరుగుతున్నాడని విమర్శించారు.  చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో తగదాలు పెట్టుకుంటాడని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన వ్యాఖ్య చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుందన్నారు. చెడ్డ కార్మికుడిలా, చెడ్డ రాజకీయ నేతలా.. అన్ని వ్యవస్థలపై చంద్రబాబు నెపం మోపుతున్నాడన్నారు. 

ఎగ్జిట్‌ పోల్, ఈవీఎం, వీవీ ప్యాట్‌లను నమ్మని చంద్రబాబు 23వ తేదీ వెలువడే ఫలితాలనైనా నమ్ముతారా అని అంబటి ప్రశ్నించారు. ఈవీఎంలను మోడీ, వైయస్‌ జగన్‌ కలిసి శాటిలైట్‌ ద్వారా మేనేజ్‌ చేశారని ఆరోపించినా ఆశ్చర్యం లేదన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గెలిచినప్పుడు 2004లో గెలిచినప్పుడు ఈవీఎంలు వాడలేదా..? 2009లో మళ్లీ వైయస్‌ఆర్‌ విజయం సాధించినప్పుడు ఈవీఎంలు వాడలేదా..? 2014లో పవన్‌ కల్యాణ్, మోడీతో తెలుగుదేశం పార్టీ జతకట్టినప్పుడు ఈవీఎంలు వాడలేదా.. చంద్రబాబూ అని ప్రశ్నించారు. 23వ తేదీన కౌంటింగ్‌ కేంద్రాల వద్ద చంద్రబాబు కోటరీ గందరగోళం సృష్టించేందుకు కుట్ర చేస్తుందని, వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు, ప్రజాస్వామ్య వాదులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే విధంగా ఎన్నికల అధికారులు, పోలీస్‌ యంత్రాంగం అల్లరిమూకలను అణచివేయాలన్నారు. 

తెలుగుదేశం పార్టీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, ఫలితాలు వెలువడకముందే ఎందుకు అంత భయపడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. దేవినేని ఉమా పోలవరం పేరుతో ఇష్టారీతిగా ప్రజల సొమ్ము మెక్కాడని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు. అదే విధంగా బుద్ధా వెంకన్న తొడలు కొడుతున్నాడని, మీసాలు తిప్పి, తొడలు కొట్టినవారు ఎవరూ పాలించిన దాఖలాలు లేవన్నారు. పోలింగ్‌ పర్సంటేజ్‌ చంద్రబాబు లాంటి దుర్మర్గుడు ఉండకూడదనే పెరిగింది. నూటికి నూరుపాళ్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top