తాడేపల్లి : విశాఖ ఫార్మా సిటీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా సిటీలో దక్షిణ్ ఎనర్జీ సంస్థలో చోటుచేసుకున్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైయస్ జగన్ కోరారు. అలాగే ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలని సూచించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన ఆర్థిక సహాయం అందించాలని వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు.