తాడేపల్లి: చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా, రాయలసీమకు తీరని ద్రోహం చేశారని, ఆ ప్రాంత ప్రజలంటే ఆయనకు ఎప్పుడూ చిన్న చూపే అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. ఇప్పుడు కూడా రాయలసీమకు అన్యాయం చేస్తూ ఎయిమ్స్, ఆంధ్రప్రగతి బ్యాంక్ను అమరావతికి తరలించారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్ గుర్తు చేశారు. శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: లోకేష్ కోసమే మహానాడు నిర్వహించినట్లుంది: చంద్రబాబు పరిపాలనలో ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి దూరమయ్యారు. సినిమా రిలీజ్కు డేట్లు ఇచ్చినట్టు సంక్షేమ పథకాలకు డేట్లు ప్రకటించడమే తప్ప, ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. పథకాల అమలు గురించి మహానాడులో స్పష్టమైన ప్రకటన వస్తుందనుకున్న ప్రజలకు నిరాశే మిగిలింది. ప్రజలకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పుకోకుండా తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జగన్ని తిట్టడమే సరిపోయింది. సామాన్య ప్రజలే కాదు తండ్రీకొడుకుల సొంత డబ్బా చూసి టీడీపీ కార్యకర్తలు సైతం విసిగిపోయారు. మహానాడు జరిగిన తీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ వారసునిగా కొడుకు లోకేష్ను చేసేందుకు చంద్రబాబు మహానాడు వేదికగా ప్రయత్నించినట్లు ప్రతి ఒక్కరికీ అర్థమై పోయింది. ఎన్టీఆర్ పేరు వాడుకోవడమే తప్ప, ఆయన పేరు నిలబెట్టే నిజాయితీ చంద్రబాబులో లేదు. నిజంగా ముద్దుబిడ్డ ఆ పని చేస్తారా?: రాయలసీమ ప్రయోజనాలను కాపాడే వారే రాయలసీమ ముద్దుబిడ్డలవుతారు. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే చంద్రబాబు లాంటి వారు ఎప్పటికీ రాయలసీమ బిడ్డ కారు.. కాలేరు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని, హైకోర్టు రాయలసీమలోనే ఉండాలి. రాయలసీమ ప్రాంత అవసరాలు తీరిన తరువాతే జలాలను తరలించాలి. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు రాయలసీమ ప్రాంత ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. గత ప్రభుత్వంలో సీఎం శ్రీ వైయస్ జగన్ అనంతపురం జిల్లాకు కేటాయించిన ఎయిమ్స్ను కూడా ఇప్పుడు సీఎం చంద్రబాబు మంగళగిరికి తరలించాడు. ఇంకా కడప కేంద్రంగా అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు సేవలందించి దేశంలోనే పేరు తెచ్చుకుంటే దానిని ఏపీ ప్రగతి గ్రామీణ బ్యాంకుగా మార్చి మంగళగిరికి మార్చేశారు. ఇవన్నీ రాయలసీమ బిడ్డలు చేసే పనులా? చంద్రబాబు చేసిన గాయాలను రాయలసీమ ప్రజలు నిద్రలో కూడా మర్చిపోరు. రాయలసీమ అభివృద్దికి తన దగ్గర బ్లూ ప్రింట్ ఉందని మరోసారి దగాకోరు మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు టెంకాయలు మాత్రమే కొడతాడు. ఈ హామీలన్నీ ఏమయ్యాయో చెప్పు బాబూ?: గతంలో 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు, రాయలసీమకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చాడో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయిస్తే, దాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆనాడే కుప్పంలో ఎయిర్పోర్ట్ అన్నాడు. ఇప్పటికీ అంటూనే ఉన్నారు. చిత్తూరు ఆస్పత్రిని అపోలోకి అప్పగించి దాన్నే డెవలప్మెంట్ అంటూ భ్రమలు కల్పిస్తున్నాడు. మెగా సిటీ, ఫుడ్ పార్క్, మెట్రోరైలు, హార్టీకల్చర్ జోన్, శ్రీకాళహస్తి–తిరుమతి–కాణిపాకం ఆధ్యాత్మిక జోన్ వంటి హామీల్లో చంద్రబాబు నెరవేర్చినవి ఎన్ని? కడప జిల్లాకు వైయస్సార్ పేరు తీసేసి కక్ష తీర్చుకున్నాడు. కడపలో స్టీల్ ప్లాంట్, సిమెంట్ పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, ఎయిర్పోర్ట్, పారిశ్రామిక స్మార్ట్ సిటీ, సోలార్ పవర్ విండ్ పార్క్, ఫుడ్ పార్క్, ఉర్దూ వర్సిటీ, గార్మెంట్ క్లస్టర్.. ఇవేవీ నెరవేరలేదు. అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు వైయస్ఆర్ హయాంలోనే డ్రిప్, స్ప్రింకర్లతో సేద్యం చేసుకునేలా ప్రోత్సహించగా, దాన్ని కూడా చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటున్నాడు. ఉద్యానవన కేంద్రం ఎక్కడుందో చెప్పాలి. తాను పుట్టిన చిత్తూరు జిల్లాను కూడా చంద్రబాబు మోసగించాడు. కియా పేరు చెప్పి అనంతపురం ప్రజలను మభ్య పెట్టడమే తప్ప, ఆ సంస్థలో జిల్లా యువతకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు. రాయలసీమ ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచితే, తన పార్టీ నాయకులతో ప్రకాశం బ్యారేజీ మీద ధర్నా చేయించిన ఘనుడు చంద్రబాబు. హంద్రీనీవాను సకాలంలో పూర్తి చేయకుండా రాయలసీమ రైతులను వంచించిన దుర్మార్గుడు చంద్రబాబు. వైయస్ జగన్ పాలనలో గండికోట నిల్వ సామర్థ్యాన్ని 40 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు పెంచారు. మనకు దక్కాల్సిన నీటిని తెలంగాణ రాష్ట్రం తోడేస్తున్నా పట్టించుకోవడం లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను కూడా పక్కన పడేశాడు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో తీసుకుని రాయలసీమకు తీరని ద్రోహం చేశాడు. చంద్రబాబు నిజంగా రాయలసీమ బిడ్డ అని నిరూపించుకోవాలంటే హైకోర్టును కర్నూలుకు మార్చాలి. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును తిరిగి కడపకు, ఎయిమ్స్ను అనంతపురం జిల్లాకు తరలించాలి. అలాగే చెన్నై– బెంగళూరు కారిడార్ పనులు పూర్తి చేయాలని సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు.