తాడేపల్లి: రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్లోనే రఘురామ పని చేస్తున్నారని, బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. మిథున్రెడ్డి మాట్లాడుతూ..‘‘రఘురామకృష్ణంరాజు అకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. కుటుంబసభ్యులను కూడా పావులుగా వాడుకుంటున్నారు. ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్డ్ చేసేందుకు యత్నిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ నేతలు అరెస్టైనప్పుడు కూడా ఇంత హడావిడి చేయని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం హైరానా పడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు కొట్టలేదని వైద్య బృందమే కోర్టుకు నివేదిక ఇచ్చిందన్న మిథున్రెడ్డి.. కేవలం రమేష్ ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ జరగాలనడం సరికాదని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేశారు: బాలశౌరి ఎంపీ కాకముందే రఘురామకృష్ణరాజు ఐదుసార్లు పార్టీ మారారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి అన్నారు. పార్టీలో రఘురామకృష్ణరాజుకు సముచిత స్థానం ఇచ్చామని, అయినప్పటికీ సీఎం, మంత్రులపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని, పోలీసులు కొట్టారంటూ రఘురామకృష్ణరాజు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.