విశాఖ: మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లీష్ మీడియం పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబును పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతు తెలిపేందుకు వెళ్లడాన్ని కూడా అడ్డుకోవడంపై ఎమ్మెల్సీ పోలీసులను నిలదీశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మారికవలస గురుకుల పాఠశాల వద్దకు చేరుకున్న ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ జీసీసీ చైర్మన్ శోభా స్వాతిరాణి ఆందోళనలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపారు. గిరిజన బిడ్డల విద్య కోసం పోరాడటం నేరమా? తల్లిదండ్రుల పక్షాన నిలబడటం తప్పా? అని వైయస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. పోలీసుల అడ్డంకులతో గిరిజన విద్యార్థుల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని ఆపలేరని, మారికవలస గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.