విశాఖ: కట్టే కాలే వరకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటానని అరక వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఉద్ఘాటించారు. పార్టీ మారుతానని తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయాలు వదిలేస్తాకానీ వైయస్ఆర్సీపీని వీడే ప్రసక్తేలే అరకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీ మార్పు కథనంపై మత్స్యలింగం తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..`ఒక ఛానల్ తనపై తప్పుడు కథనం ప్రచారం చేసింది. నేను వైయస్ఆర్సీపీని వీడే ప్రసక్తే లేదు. నా కట్టె కాలే వరకు వైయస్ జగన్ వెంటే ఉంటాను. అవసరమైతే రాజకీయాలను వదిలేస్తానని వైయస్ఆర్సీపీని వీడను. నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా వైయస్ఆర్సీపీలోనే కొనసాగుతారు. నేను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధం. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి వైయస్ జగన్ నే కారణం. రాజకీయంగా నాకు సముచితమైన స్థానాన్ని వైయస్ జగన్ కట్టబెట్టారు. వైయస్ జగన్ ఇచ్చిన గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను. తనపై కొంతమంది కూటమి నేతలు తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ఇటువంటి ప్రచారాలను పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరూ నమ్మవద్దు` అంటూ మత్స్యలింగం విజ్ఞప్తి చేశారు.