విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు సలహాలు ఇవ్వాల్సింది పోయి.. శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్నినాని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో కోవిడ్ పరిస్థితులపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కరోనా గతంలో కంటే ఇప్పుడు ఊపిరితిత్తుల పై ఎక్కువ ప్రభావం చూపిస్తోందన్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగ్గా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నామని.. బాధ్యత గల నాయకుడిగా చంద్రబాబు సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి శవ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పగలు, రాత్రి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని.. ఆక్సిజన్, బెడ్ల కొరత కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయా? అని పేర్కొన్నారు. వ్యాధి తీవ్రత పెరిగింది... రూపం మారింది.. హాస్పిటల్స్ లో సామర్థ్యం కంటే ఎక్కువ మంది పేషెంట్లకు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అన్ని రంగాల నుంచి ఆక్సిజన్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని.. చంద్రబాబు తగిన సలహా ఇస్తే పాటించటానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.