అమలాపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ, జూన్ 12న నిర్వహించనున్న “వెన్నుపోటు దినం” బైక్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ వైయస్ఆర్సీపీ నాయకులు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, అమలాపురం పార్లమెంట్ కో-ఆర్డినేటర్, పీఏసీ సభ్యులు పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, మోసపూరిత పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైన ప్రభుత్వ వైఖరిని ప్రజలకు గుర్తు చేసేందుకు, రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 12న నిర్వహించనున్న బైక్ ర్యాలీ ద్వారా కూటమి ప్రభుత్వ మోసాలు, ప్రజావ్యతిరేక విధానాలు, అన్యాయాలు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టే ఈ కార్యక్రమానికి పోలీసులు సహకరించాలని కోరారు. అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలను విస్మరించిన ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య హక్కు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు , వంటెద్దు వెంకన్నాయుడు , రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శి ఉండ్రు వెంకటేష్ , పట్టణ అధ్యక్షుడు సంసాని నాని , జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు , జిల్లా యువజన విభాగ కార్యదర్శి విత్తనాల మూర్తి , కుంచె స్వామి , ఒగురి విజయ్, కొటుం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.