సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రిలో స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు వైయ‌స్ జ‌గ‌న్‌ పరామర్శ 

 వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్న మాజీ సీఎం.. బాధిత కుటుంబాలకు ధైర్యం 

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న విషాదకర ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విశాఖలోని సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైయ‌స్‌ జగన్‌ స్వయంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స విధానం, బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ప్రశ్నించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.  బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా ప్రమాదంలో గాయపడిన కార్మికుల కుటుంబ సభ్యులతో కూడా వైయ‌స్‌ జగన్‌ మాట్లాడారు. వారికి ధైర్యం చెబుతూ, ఈ క్లిష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని, వారి సమస్యలను ఓపికగా విన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైయ‌స్‌ జగన్‌ పర్యటనతో సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రి పరిసరాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన వారి ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 

Back to Top