విశాఖపట్నం: విశాఖ ఎయిర్పోర్టు పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. పార్టీ నాయకులు బాలరాజు, దేవన్రెడ్డి లను ఎయిర్పోర్టు సమీపంలోనే పోలీసులు నిలువరించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పార్టీ అధినేత వైయస్ జగన్ను కలిసేందుకు వెళ్తున్న తమను ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైయస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం ఆదేశాలతోనే పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాలరాజు, దేవన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎయిర్పోర్టు వద్దకు చేరుకున్న పలువురు వైయస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా పోలీసుల చర్యలకు నిరసన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో విశాఖ ఎయిర్పోర్టు ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ప్రతిపక్ష నాయకుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని ప్రభుత్వం పునఃసమీక్షించాలని, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని వైయస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు.